ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'నన్నే మోసం చేసి రూ.56 లక్షలు కొట్టేశారు': ఎంపీ కళ్యాణ్ బెనర్జీ

national |  Suryaa Desk  | Published : Sat, Nov 08, 2025, 07:30 PM

దేశంలో పెరుగుతున్న సైబర్ మోసాల ఘటనలపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ శనివారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తనలాంటి ప్రజాప్రతినిధినే మోసగాళ్లు ట్రాప్ చేసి రూ.56 లక్షలు కొట్టేయగల్గితే.. సాధారణ పౌరులకు రక్షణ ఎలా కల్పించబడుతుందని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు.


"నాలాంటి వ్యక్తి బ్యాంక్ మోసానికి గురైతే.. ఇక సాధారణ ప్రజలు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలి? ఆర్థిక మంత్రిత్వ శాఖ సైబర్ నేరాల నిరోధక విభాగాన్ని ఎందుకు ఏర్పాటు చేయడం లేదు?" అని బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ కేంద్రాన్ని నిలదీశారు. తన ఖాతా నుంచి రూ. 56 లక్షలకు పైగా అక్రమంగా మాయమైన సైబర్ మోసం కేసుపై ఆయన ఈ విధంగా స్పందించారు.


నకిలీ పత్రాలతో మోసం..


పశ్చిమ బెంగాల్‌లోని సెరంపోర్ ఎంపీ అయిన కళ్యాణ్ బెనర్జీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో ఒక పాత ఖాతా ఉందని.. దాన్ని తాను చాలా కాలంగా ఉపయోగించలేదని తెలిపారు. మోసగాళ్లు కేవైసీని ఉపయోగించి ఈ మోసానికి పాల్పడ్డారని వివరించారు. తన ఫోటోను సూపర్‌ఇంపోజ్ చేసినట్లు వివరించారు. అలాగే తన పాన్, ఆధార్ వివరాలను తప్పుగా ఉపయోగించి ఈ మోసానికి పాల్పడ్డట్లు పేర్కొన్నారు. ఎంపీగా తాను సంపాదించుకున్న దాదాపు రూ. 57 లక్షలు ఆ ఖాతా నుంచి అక్రమంగా బదిలీ అయ్యాయని ఆయన తెలిపారు.


అధికార వర్గాల సమాచారం ప్రకారం.. 2001-2006 మధ్య కాలంలో అసన్‌సోల్ సౌత్ నియోజకవర్గం నుంచి కళ్యాణ్ బెనర్జీ ఎమ్మెల్యేగా పని చేశారు. ఆ సమయంలో ఇతర ఎమ్మెల్యేలతోపాటు కళ్యాణ్ బెనర్జీ కూడా తన పేరు మీద ఒక ప్రభుత్వ రంగ బ్యాంక్ బ్రాంచ్‌లో అకౌంట్‌ను ఓపెన్ చేశారు. ఎమ్మెల్యేగా ఆయనకు వచ్చే జీతం సహా అన్ని అలవెన్సులను ఆ అకౌంట్‌లోనే జమ చేసేవారు. అయితే.. చాలా కాలంగా ఆ అకౌంట్‌లో ట్రాన్సాక్షన్లు జరగకపోవడంతో అది డార్మెంట్‌ అకౌంట్‌గా మారిపోయింది. ఈ విషయం గుర్తించిన సైబర్ నేరగాళ్లు దీన్ని లక్ష్యంగా చేసుకుని సైబర్ మోసానికి పాల్పడ్డారు. నకిలీ పత్రాల ద్వారా ఈ కేవైసీ పూర్తి చేసి అందులో ఉన్న డబ్బులు మొత్తాన్ని దోచేశారు.


అయితే అనుమానాస్పద లావాదేవీలను గుర్తించిన వెంటనే.. ఎస్‌బీఐ బ్యాంక్ కోల్‌కతా సైబర్‌క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు సాగుతుండగా.. ఎంపీ కళ్యాణ్ బెనర్జీ దీనిపై స్పందించారు. ఎస్‌బీఐ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు సాగుతోందని.. శుక్రవారం రోజు రాత్రే ఎస్‌బీఐ తన పార్లమెంట్ ఖాతాలో రూ. 57 లక్షలు జమ చేసిందని వివరించారు. ఇది కొన్ని అంతర్గత లోపాల వల్ల జరిగిందని వారు చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ కేసును పూర్తిగా దర్యాప్తు చేయాలని కోల్‌కతా పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. మరోవైపు సైబర్ నేరగాళ్లు ఇంతటి ప్రముఖుడి ఖాతాను ఎలా యాక్సెస్ చేయగలిగారు, ఈ మోసంలో బ్యాంకు ఉద్యోగుల ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa