ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం': కిరణ్ రిజిజు

national |  Suryaa Desk  | Published : Sat, Nov 08, 2025, 07:33 PM

పార్లమెంట్ శీతాకాల సమావేశాల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సన్నద్ధత వ్యక్తం చేసింది. డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నట్లు.. ఈ నెల 19వ తేదీ వరకు కొనసాగనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు శనివారం ప్రకటించారు. ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపినట్లు ఆయన వెల్లడించారు.


"పార్లమెంటరీ వ్యవహారాల అత్యవసర పరిస్థితులకు లోబడి డిసెంబర్ 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకూ పార్లమెంటు శీతాకాల సమావేశాలను నిర్వహించాలనే ప్రభుత్వ ప్రతిపాదనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు" అని కిరణ్ రిజిజు తన ఎక్స్ ఖాతా వేదికగా ట్వీట్ చేశారు. "మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే నిర్మాణాత్మకమైన, అర్థవంతమైన సెషన్‌ను ఆశిస్తున్నాను" అని ఆయన పేర్కొన్నారు.


 ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న శీతాకాల సమావేశాల్లో ఇది అత్యంత తక్కువ కాలం (19 రోజులు) జరగనున్న సమావేశాలలో ఒకటి కానుంది. గత సంవత్సరం శీతాకాల సమావేశాలు నవంబర్ 25న ప్రారంభమై డిసెంబర్ 20న ముగిశాయి. ఆ 26 రోజుల్లో లోక్‌సభ 20 సార్లు, రాజ్యసభ 19 సార్లు సమావేశం అయ్యాయి. అప్పుడు లోక్‌సభ ఉత్పాదకత దాదాపు 54.5 శాతంగా, రాజ్యసభ ఉత్పాదకత 40 శాతంగా నమోదైంది. ఆ సెషన్‌లో భారతీయ వాయుయాన్ విధేయక్, 2024తో సహా ఐదు బిల్లులు ఉభయ సభల్లో ప్రవేశపెట్టగా.. నాలుగు ఆమోదం పొందాయి.


పార్లమెంట్ చివరి సారిగా జూలై 21వ తేదీన ప్రారంభమై ఆగస్టు 21వ తేదీన ముగిసిన వర్షాకాల సమావేశాల కోసం సమావేశమైంది. ఈ 21 రోజుల సమావేశాల్లో విపక్షాల నిరసనలు, తరచూ ఎదురైన అంతరాయాల కారణంగా ఉత్పాదకత గణనీయంగా తగ్గింది. షెడ్యూల్ చేసిన 120 గంటలకు గాను.. లోక్‌సభ కేవలం 37 గంటలు (ఉత్పాదకత 31%) మాత్రమే పని చేసింది. అలాగే రాజ్యసభ కూడా 120 గంటలకు 41 గంటలు (ఉత్పాదకత 38.8%) మాత్రమే సమావేశమైంది. అయినప్పటికీ.. ఈ సెషన్‌లో 14 బిల్లులు లోక్‌సభలో ప్రవేశ పెట్టగా 12 ఆమోదం పొందాయి. రాజ్యసభ 15 బిల్లులను ఆమోదించింది. అంతేకాకుండా ఆపరేషన్ సింధూర్‌పై రెండు రోజుల పాటు ప్రత్యేక చర్చ జరిగింది. ఇందులో 130 మందికి పైగా ఎంపీలు పాల్గొన్నారు. రానున్న శీతాకాల సమావేశాలు ఉత్పాదకత విషయంలో ఎలా ఉంటాయో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa