దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వానికి తెరపడింది. అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలిన సుదీర్ఘ ప్రచారానికి శనివారంతో ముగింపు పలికారు. ఇప్పటికే నవంబర్ 6న జరిగిన తొలి దశ పోలింగ్లో రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో 65.08 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక నవంబర్ 11న 122 స్థానాలకు రెండో దశ పోలింగ్ జరగనుండగా, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలు ఉన్నాయి. తొలి విడతలో 121 స్థానాలకు పోలింగ్ జరిగింది.రెండో విడత ప్రచారానికి చివరి రోజైన ఆదివారం రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా విపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విపక్షాల 'జంగిల్ రాజ్' పాలనను గుర్తుచేస్తూ, దేశంలోకి చొరబాటుదారులను ఏరివేస్తామని హామీ ఇచ్చారు. తొలి దశ పోలింగ్లోనే ప్రజలు విపక్ష 'ఇండియా' కూటమికి 65 వోల్టుల షాక్ ఇచ్చారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి తాను మళ్లీ వస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.మరోవైపు, ఎన్డీఏ కూటమి విజయంపై చేస్తున్న ప్రచారాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కొట్టిపారేశారు. వారి వాదనల్లో ఎలాంటి పస లేదని తెలిపారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేత పవన్ ఖేరా, ఓటర్ల జాబితాలో అవకతవకలకు ఎన్నికల కమిషన్ సహకరిస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.ఇక, బిహార్లో ప్రచారం ముగిసిన మరుసటి రోజే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్లో పర్యటించడం విమర్శలకు దారితీసింది. బిహార్ ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఈ విషయంపై స్పందిస్తూ, రాహుల్ గాంధీ 'పిక్నిక్'లో ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. కీలకమైన సమయంలో బిహార్కు దూరంగా ఉండటమంటే విపక్షాలు ఓటమిని అంగీకరించినట్లేనని ఆయన విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa