అమెరికన్ ఉద్యోగాలను రక్షించాలనే లక్ష్యంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసాలపై తీసుకున్న కఠిన వైఖరి తర్వాత.. ఈ వీసా కార్యక్రమాన్ని దుర్వినియోగానికి సంబంధించిన 175 కేసులపై దర్యాప్తును మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ప్రాజెక్ట్ ఫైర్వాల్ను ప్రారంభించారు. ట్రంప్ పరిపాలన హెచ్-1బీ వీసా దరఖాస్తులపై లక్ష డాలర్లు (మన భారత కరెన్సీలో సుమారు రూ.88 లక్షలు) వన్ టైమ్ ఫీజును విధించిన వెంటనే.. కార్మిక శాఖ 'ప్రాజెక్ట్ ఫైర్వాల్'ను ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ ఫైర్వాల్ ద్వారా హెచ్-1బీ వీసా దుర్వినియోగాన్ని అరికట్టి.. అమెరికన్ల ఉద్యోగాలను పరిరక్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
హెచ్-1బీ వీసా దుర్వినియోగాన్ని అరికట్టడానికి, అమెరికా ఉద్యోగాలను రక్షించడానికి కార్మిక శాఖ తమ వద్ద ఉన్న ప్రతి వనరును ఉపయోగిస్తోందని.. ఈ సందర్భంగా కార్మిక శాఖ కార్యదర్శి లోరీ చావెజ్ డీరెమర్ వెల్లడించారు. అమెరికన్ల ఉద్యోగాలను రక్షించడానికి.. అనుమానిత ఉల్లంఘనలపై తాను వ్యక్తిగతంగా దర్యాప్తులకు ధృవీకరణ ఇస్తున్నానని తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో.. నైపుణ్యం కలిగిన ఉద్యోగ అవకాశాలు మొదట అమెరికన్ కార్మికులకే దక్కేలా చూస్తామని ఆమె ఎక్స్ వేదికగా ప్రకటించారు.
సెప్టెంబరు 19వ తేదీన ట్రంప్ పరిపాలన ఈ లక్ష డాలర్ల ఫీజును ప్రకటించింది. అయితే స్టేటస్ మార్పు, బస పొడిగింపు కోరుకునే దరఖాస్తుదారులకు ఈ ఫీజు వర్తించదని అమెరికా పౌరసత్వం ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) తర్వాత స్పష్టం చేసింది. లక్ష ఫీజు నుంచి మినహాయింపులు అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే లభిస్తాయని పేర్కొంది. హెచ్-1బీ వీసా పొందిన విదేశీ ఉద్యోగి ఉనికి అమెరికా జాతీయ ప్రయోజనాలకు అవసరం అయినప్పుడు.. ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ఏ అమెరికన్ కార్మికుడు అందుబాటులో లేనప్పుడు.. ఆ ఉద్యోగి అమెరికా భద్రతకు లేదా సంక్షేమానికి ముప్పు కలిగించని వ్యక్తి అయినప్పుడు మాత్రమే ఈ ఫీజు మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది.
ఇటీవలి సంవత్సరాల్లో ఆమోదించబడిన మొత్తం హెచ్-1బీ దరఖాస్తుల్లో దాదాపు 71 శాతం మంది భారతీయులే ఉన్నారని యూఎస్సీఐఎస్ తెలిపింది. దీంతో ఈ కఠిన నిబంధనలు భారతీయ ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నిర్ణయం.. ఐటీ రంగంలో ఆందోళన కలిగించినప్పటికీ.. ఈ ఫీజు పెరుగుదల తమ సంస్థపై తక్షణ ప్రభావం చూపదని.. టాటా టెక్నాలజీస్ సీఈఓ, ఎండీ వారెన్ హారిస్ వెల్లడించారు. తమది గ్లోబల్ కంపెనీ అని.. తమ ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఆయా దేశాలకు చెందినవారేనని వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa