అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ రాజకీయాలపై సంచలన ప్రకటన చేశారు. ఈ ఏడాది దక్షిణాఫ్రికాలో జరగనున్న జీ-20 దేశాల అధినేతల సదస్సును అమెరికా బహిష్కరించాలని నిర్ణయించినట్లు ఆయన స్పష్టం చేశారు. దక్షిణాఫ్రికాలో మైనారిటీలైన శ్వేతజాతి (తెల్లజాతి) రైతులను చూస్తున్న తీరుపై ట్రంప్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శనివారం తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ట్రూత్ సోషల్' వేదికగా ట్రంప్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. "జీ-20 సదస్సు దక్షిణాఫ్రికాలో జరగడం పూర్తి అవమానకరం" అని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు.
దక్షిణాఫ్రికాలో శ్వేతజాతి రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులపై ప్రపంచ దృష్టిని ఆకర్షించేందుకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. "ఆ దేశంలో తెల్లజాతి రైతులపై జరుగుతున్న హింస, ఆస్తుల స్వాధీనం, హత్యలు వంటి దారుణాలు ప్రపంచానికి తెలియాలి. ఈ దారుణాలపై దక్షిణాఫ్రికా చర్యలు తీసుకోనంత వరకు.. ఆ దేశంలో జరిగే ఏ అంతర్జాతీయ వేదికకు అమెరికా తరపున ఎవరూ హాజరు కాకూడదు" అని ట్రంప్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
తాజాగా మయామిలో జరిగిన ఒక ప్రసంగంలో ట్రంప్.. దక్షిణాఫ్రికాను ఏకంగా జీ-20 గ్రూప్ నుంచే తొలగించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు సదస్సును బహిష్కరించాలని నిర్ణయించడం ద్వారా తన వైఖరిని మరింత బలంగా చాటుకున్నారు. ట్రంప్ తన భవిష్యత్తు ప్రణాళికలను కూడా ప్రకటించారు. వచ్చే ఏడాది ఫ్లోరిడాలోని మయామిలో నిర్వహించే జీ-20 సదస్సు కోసం వేచి చూస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
దక్షిణాఫ్రికాలో తెల్లజాతి రైతులపై హింస జరుగుతోందంటూ ట్రంప్ చేసిన సంచలన ప్రకటన, జీ-20 సదస్సు బహిష్కరణ నిర్ణయంపై దక్షిణాఫ్రికా ప్రభుత్వం గట్టి జవాబిచ్చింది. ట్రంప్ ఆరోపణలను దక్షిణాఫ్రికా పూర్తిగా తిప్పికొట్టింది. తమ దేశంలో తెల్లజాతి ప్రజలు ఇప్పటికీ నల్లజాతి ప్రజల కంటే ఎక్కువ జీవన ప్రమాణాలు, అధిక ఆర్థిక శక్తిని కలిగి ఉన్నారని స్పష్టం చేసింది. వర్ణవివక్ష అనే తెల్లజాతి పాలనా వ్యవస్థ ముగిసిన ముప్పై సంవత్సరాల తరువాత కూడా దేశ ఆర్థిక వ్యవస్థపై తెల్లజాతి ప్రజలదే పైచేయిగా ఉందని దక్షిణాఫ్రికా ప్రభుత్వ ప్రతినిధులు వివరించారు. దేశంలో తెల్లజాతి మైనారిటీ రైతులు ఎటువంటి వివక్షకు గురికావడం లేదని, వారిపై హింస జరుగుతున్నట్టు ట్రంప్కు తప్పుడు సమాచారం అందిందని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా పేర్కొన్నారు.
ట్రంప్ బహిష్కరణ ప్రకటన చేసినప్పటికీ.. జీ20 సదస్సు షెడ్యూల్లో ఎటువంటి మార్పు ఉండబోదని దక్షిణాఫ్రికా స్పష్టం చేసింది. దక్షిణాఫ్రికా 2024 డిసెంబర్ 1వ తేదీ నుంచి 2025 నవంబర్ 30వ తేదీ వరకు జీ20 అధ్యక్ష పదవిని నిర్వహిస్తోంది. ఈ ఏడాది జీ20 దేశాల అధినేతల సదస్సు నవంబర్ 22, 23 తేదీల్లో జోహన్నెస్బర్గ్లో జరగనుంది. ఈ సదస్సు ఆఫ్రికా ఖండంలో జరగడం ఇదే మొదటిసారి కావడం చారిత్రక అంశం. ఈ సదస్సును విజయవంతం చేయడానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల అధినేతలు హాజరుకానున్న తరుణంలో.. ట్రంప్ బహిష్కరణ ప్రకటన అంతర్జాతీయ వేదికపై చర్చనీయాంశంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa