ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సైన్యం విషయంలో భారత్‌నే ఫాలో అవుతున్న పాక్

international |  Suryaa Desk  | Published : Sun, Nov 09, 2025, 08:49 PM

భారతదేశం తరహాలో త్రివిధ దళాలను ఏకీకృతం చేసేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. సైన్యం, వైమానిక దళం, నౌకాదళాల మధ్య మెరుగైన సమన్వయం, ఏకీకృత కమాండ్ వ్యవస్థ కోసం 'కమాండర్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌' అనే సరికొత్త పదవిని సృష్టించేందుకు సిద్ధమైంది. ఈ ఏకీకృత వ్యవస్థకు సీడీఎఫ్ అధిపతిగా వ్యవహరిస్తారు. అయితే ఈ పదవి కోసం ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ను పేరును పాకిస్థాన్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అక్కడి మీడియా సంస్థలన్నీ ఈయనే ఆ పదవి చేపట్టబోతున్నట్లు చెబుతున్నాయి.


27వ రాజ్యాంగ సవరణ బిల్లు


శనివారం ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం 27వ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టింది. రాజ్యాంగంలోని సాయుధ దళాలకు సంబంధించిన అధికరణం 243 లో మార్పులు చేయాలని ఈ బిల్లు ప్రతిపాదించింది. ఈ సవరణ ప్రకారం.. ప్రధాన మంత్రి సలహా మేరకు రాష్ట్రపతి ఆర్మీ చీఫ్‌తో పాటు కొత్త సీడీఎఫ్‌ను కూడా నియమిస్తారు. ఈ చరిత్రాత్మక మార్పుకు ప్రేరణ.. ఈ ఏడాది మే నెలలో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన నాలుగు రోజుల సంఘర్షణ అని స్థానిక మీడియా నివేదికలు తెలిపాయి. పుల్వామా ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ మే 7న ప్రారంభించిన 'ఆపరేషన్ సింధూర్' దెబ్బకు పాకిస్థాన్ సైనిక స్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ వైఫల్యం తర్వాత ఆధునిక యుద్ధంలో ఏకీకృత కార్యాచరణ ఎంత అవసరమో పాక్ సైన్యం గుర్తించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.


  ఈ నెల 28వ తేదీన పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌ను.. కొత్తగా సృష్టిస్తోన్న సీడీఎఫ్‌గా నియమించనున్నట్లు పాకిస్థాన్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ సంఘర్షణ జరిగిన వెంటనే, ప్రభుత్వం మునీర్‌ను ఫీల్డ్ మార్షల్ హోదాకు పదోన్నతి కల్పించింది. దేశ చరిత్రలో ఈ అత్యున్నత సైనిక హోదా పొందిన రెండో అధికారి ఆయనే. సీడీఎఫ్‌ పదవి ద్వారా పాక్ సైన్యంపై మునీర్‌కు మరింత పట్టు పెరుగుతుంది.


ఎందుకంటే ఈ సవరణ ప్రకారం.. ఆర్మీ చీఫ్‌గానే కాక చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్‌గా కూడా వ్యవహరించే వ్యక్తి, ప్రధానితో సంప్రదించి, జాతీయ వ్యూహాత్మక కమాండ్ అధిపతిని నియమించే అధికారం కలిగి ఉంటారు. రాజ్యాంగ సవరణ బిల్లును సెనేట్ (ఎగువ సభ)లో ప్రవేశ పెట్టగా.. ప్రతిపక్ష పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ నాయకుడు అలీ జాఫర్ బిల్లుపై తగినంత చర్చ లేకుండా ఆమోదించడానికి తొందరప డుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. బిల్లును పూర్తి స్థాయిలో సమీక్షించడానికి స్టాండింగ్ కమిటీకి పంపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa