గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఇటీవల ముగ్గురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరు దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు కుట్ర చేశారని భద్రతా అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. భారత్ చుట్టూ ఉగ్రవాదాన్ని విస్తరించేందుకు పాకిస్తాన్ కుట్రలు చేస్తోందని పేర్కొన్నాయి. అందులో భాగంగా భారత సరిహద్దు దేశాలైన నేపాల్, బంగ్లాదేశ్లోని పలు ప్రాంతాల్లో.. ఉగ్ర స్థావరాలు, శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపాయి. భారత సరిహద్దులకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉగ్ర నివాసాలన ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పాయి. ఈ మేరకు భారత నిఘా సమాచారాన్ని ఉటంకిస్తూ జాతీయ మీడియా కథనాలు వెలువరిస్తోంది.
ఆపరేషన్ సిందూర్ తర్వాత ఉగ్ర స్థావరాల ఏర్పాటు మరింత వేగవంతమైనట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే ఉగ్రవాద ట్రైనింగ్ తీసుకునే వారి కోసం బంగ్లాదేశ్, నేపాల్లోని కొన్ని ప్రాంతాల్లో శిక్షణ శిబిరాలు, నివాస సముదాయాలు ఏర్పాటు చేస్తున్నాయని తెలిపాయి. కాగా, ఇటీవల బంగ్లా, నేపాల్ సరిహద్దుల్లో ఉన్న పలు రాష్ట్రాల్లో ఉగ్రవాద అనుమానితులను భద్రతా సంస్థలు అరెస్ట్ చేశాయి. ఈ నేపథ్యంలో ఈ హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే భారత సరిహద్దు ప్రాంతాల్లో భద్రత పెంచినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా బంగ్లా, నేపాల్లలో విదేశీ నిధులతో నిర్మితమవుతున్న పలు ప్రాజెక్టులపై కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు నిఘా పెట్టినట్లు తెలిపాయి.
లష్కరే తొయిబా, జైషే మహమ్మద్లు సమన్వయ దాడులకు సిద్ధమవుతోన్నట్టు ఇటీవల నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఉగ్రవాద సంస్థలు చొరబాట్లు, గూఢచర్యం, సరిహద్దు లాజిస్టిక్స్ కార్యకలాపాలను గణనీయంగా పెంచాయని వెల్లడించాయి. తాజాగా మళ్లీ.. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ నేపాల్లో తమ సంస్థలను విస్తరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించడం గమనార్హం. అల్-ఖైదా, ఐసిస్ గత ఐదు నెలలుగా బంగ్లాదేశ్లో తమ కార్యకలాపాలను విస్తరించడానికి ప్రయత్నాలు వేగవంతం చేస్తున్నట్లు పేర్కొన్నాయి. అందులో భాగంగా పాక్లోని పలు ప్రాంతాల నుంచి బంగ్లాదేశ్కు, నేపాల్కు నిరంతరం ఉగ్రవాదుల వలసలు కొనసాగుతున్నాయని తెలిపాయి. అయితే ఆ ప్రాంతాల్లో ఉగ్రవాద శిబిరాల నిర్మాణానికి టర్కీ (తుర్కియే) నుంచి నిధులు అందుతున్నట్లు నిఘా సంస్థలు గుర్తించినట్లు తెలుస్తోంది.
గతేడాది మహమ్మద్ యూనస్ నేతృత్వంలో బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు అయింది. అప్పటి నుంచి భారత్ వ్యతిరేక శక్తులకు బంగ్లా వేదికగా మారింది. మహమ్మద్ యూనస్ సారథ్యంలో ఈ వ్యతిరేక కార్యకలాపాలు సాగుతున్నాయి. దీంతో పాకిస్తాన్ ఉగ్రవాదులకు బంగ్లాదేశ్ కొత్త గమ్యస్థానంగా మారిపోయింది. ఇటీవల భారత్కు చెక్ పెట్టేలా పాకిస్తాన్ మాస్టర్ ప్లాన్ వేసింది. బంగ్లాదేశ్ జనపనార ఉత్పత్తుల దిగుమతులపై భారత్ ఆంక్షలు విధించిన కొన్ని రోజులకే.. తన కరాచీ పోర్ట్ను వినియోగించుకునేందుకు బంగ్లాదేశ్కు పాకిస్తాన్ బంపరాఫర్ ఇచ్చింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత జరిగిన ఉమ్మడి ఆర్థిక కమిషన్ సమావేశంలో ఇరు దేశాలు ఈ నిర్ణయానికి వచ్చాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa