ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ కేటుగాళ్లు మోసాలు,,,రూ.58 కోట్లు పోగొట్టుకున్న ముంబయి వ్యాపారవేత్త

national |  Suryaa Desk  | Published : Mon, Nov 10, 2025, 07:39 PM

సంచలనం సృష్టించిన ముంబయి రూ.58 కోట్ల డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లో అంతర్జాతీయ సంబంధాలున్నట్టు మహారాష్ట్ర సైబర్ పోలీసులు గుర్తించారు. హాంకాంగ్, చైనా, ఇండోనేషియాలో లావాదేవీలు జరిగినట్టు కనుగొన్నారు. ముంబయికి చెందిన 72 ఏళ్ల వ్యాపారవేత్తను సైబర్ కేటుగాళ్లు ఈడీ, సీబీఐ అధికారులమని డిజిటల్ అరెస్ట్ పేరుతో బోల్తా కొట్టించి కోట్లు కాజేశారు. ఓ నేరంలో నిందితుడిగా ఉన్నారని, విచారణకు సహకరించాలని డిమాండ్ చేస్తూ.. ఆయన బ్యాంకు ఖాతాలో నగదును ఊడ్చేశారు. ఆయనను గంటలకొద్దీ వీడియో కాల్‌లో ఉంచి, బెదిరించి, మానసికంగా ప్రభావితం చేస్తూ డబ్బు బదిలీ చేయాలని ఒత్తిడి తీసుకొచ్చారు. కాల్ ముగిసే సరికి, అతడి ఖాతా నుంచి రూ.58 కోట్లు బదిలీ చేసుకున్నారు.


ఈ ఘటనపై కేసు నమోదుచేసిన మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు... ఆయన వద్ద కాజేసిన మొత్తాన్ని క్రిప్టోకరెన్సీ లావాదేవీలతో దేశం వెలుపలి ఖాతాలకు బదిలీ చేశారని దర్యాప్తులో గుర్తించారు. దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం.. ఈ వ్యవహారంలో ఒక్కరు కాదు గత ఏడాది నుంచీ దేశవ్యాప్తంగా ప్రజలను మోసం చేస్తున్న ఒక అంతర్జాతీయ సైబర్ మోసగాళ్ల సిండికేట్‌లో భాగం. ఈ కేసు దాదాపు రూ.2,000 కోట్లు విలువైన భారీ ఆన్‌లైన్ మోసాలతో ముడిపడి ఉన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు.


ఈ మొత్తం వ్యవహారాన్ని కమిషన్ కోసం బ్యాంకు ఖాతాలు నడిపిన ఒక గ్యాంగ్ నిర్వహించింది. సాధారణంగా తమ సహచరుల నియంత్రణలో ఉండే అకౌంట్‌లను నగదు సేకరణ కేంద్రాలుగా ఉపయోగించినట్టు పేర్కొన్నారు. ప్రతి డిజిటల్ అరెస్ట్ కేసులో బాధితుడ్ని ఆన్‌లైన్‌లో చెల్లించాలని కోరేవారు. తొలుత అది భారతీయ బ్యాంకు ఖాతాలకు చేరి, వెంటనే క్రిప్టోకరెన్సీగా మార్చి విదేశీ వాలెట్లకు తరలించేవారు. దీంతో మోసగాళ్లు డబ్బును దేశం బయటకు తక్షణమే తరలించే అవకాశం కలిగింది.


‘‘ఈ నెట్‌వర్క్ దాదాపు ఏడాది నుంచి చురుకుగా పనిచేస్తోంది. ప్రతి లావాదేవీ అనంతరం క్రిప్టోను అనేక వాలెట్లకు తరలించడం వల్ల డబ్బు జాడను తెలుసుకోవడం చాలా కష్టంగా మారింది’’ అని అధికారులు తెలిపారు. దర్యాప్తులో ఇప్పటివరకు బయటపడిన IP అడ్రస్‌లు, ఎక్స్చేంజ్ వివరాలలో చాలా వరకు చైనా, హాంకాంగ్, ఇండోనేషియాతో సంబంధమున్నట్లు తేలింది. ఈ కేసులో పలు బ్యాంకు ఖాతాలు, డిజిటల్ వాలెట్లను సైబర్ పోలీసులు గుర్తించారు. ఈ ఖాతాల సమాచారం కోసం విదేశీ దర్యాప్తు సంస్థలను సంప్రదించే ప్రక్రియ ప్రారంభించారు.


ఇప్పటి వరకూ డిజిటల్ అరెస్ట్ స్కామ్ కేసుతో సంబంధం ఉన్న 26 మందిని అరెస్ట్ చేసి.. కొట్టేసిన నగదును తరలించడానికి వినియోగించిన పలు నకిలీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. నకిలీ గుర్తింపు, ధ్రువపత్రాలతో బ్యాంకు ఖాతాలను తెరిచి, నిధులను దేశం దాటించడానికి కమిషన్ తీసుకున్నారని అధికారులు తెలిపారు. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, వర్చువల్ కరెన్సీల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో భారతీయులను లక్ష్యంగా చేసుకున్న భారీ సైబర్ మోసాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa