విమానాలు, బస్సులతో పోలిస్తే ఎక్కువ మంది రైలు ప్రయాణానికే మొగ్గు చూపుతారు. ఇందుకు అనే కారణాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా అయితే రైల్వేల్లో సామాను పరిమితి ఎక్కువగా ఉండటం.. సుదూర ప్రాంతాలకు సౌకర్యవంతంగా వెళ్లడం.. తక్కువ ధరతో ఎక్కువ దూరం వెళ్లొచ్చు అని చాలా మంది భావిస్తుంటారు. అయితే మనం రైలులో ప్రయాణిస్తున్నప్పుడు లగేజీ తీసుకెళ్తూ ఉంటాం.
అయితే లిక్కర్ తీసుకెళ్లవచ్చా అనే సందేహం ప్రయాణికుల్లో సర్వసాధారణంగా ఉంటుంది. పేలుడు పదార్థాలు, ఇతరులకు హాని కలిగించే వస్తువులను రైళ్లలో తీసుకెళ్లడం నేరం. ఈ క్రమంలోనే మద్యం విషయంలో ఇండియన్ రైల్వే రూల్స్ ఏం చెబుతున్నాయి. భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం.. రైళ్లలో మద్యం బాటిళ్లను తీసుకెళ్లడం, తాగడం పూర్తిగా నిషేధం. రైళ్లలో మద్యం సేవించడం లేదా తీసుకెళ్లడం వల్ల తోటి ప్రయాణికుల భద్రతకు ఇబ్బంది కలిగించడంతో పాటు, అసభ్యకరమైన ప్రవర్తనకు దారితీసి.. వారికి ఇబ్బంది కలిగిస్తుంది.
అందుకే లిక్కర్ను రైళ్లలోకి అనుమతించరు. రైలులో మద్యం తీసుకెళ్లే నిబంధనలు రోడ్డు, విమాన ప్రయాణ నిబంధనల కంటే భిన్నంగా ఉంటాయని.. సీనియర్ రైల్వే అధికారి ఒకరు వెల్లడించారు. రైళ్లలో లిక్కర్ బాటిళ్లను తీసుకెళ్లడంపై నిషేధం ఉంటుందని ఆ అధికారి స్పష్టం చేశారు. ప్రయాణికులతో పాటు.. రైళ్ల నిర్వహణలో పాల్గొనే రైల్వే రన్నింగ్ సిబ్బంది విధుల్లో ఉన్నప్పుడు మద్యం సేవించడంపై కూడా రైల్వే శాఖ కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది.
సిబ్బంది మద్యం సేవించి విధులకు హాజరైతే.. అది రైళ్ల భద్రతకు భంగం కలిగిస్తుందని.. పెను ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని పేర్కొంది. సురక్షితమైన, ప్రశాంతమైన ప్రయాణాన్ని ఆస్వాదించడానికి.. ప్రయాణికులు రైల్వేల భద్రత, ప్రవర్తనా నియమాలను తప్పనిసరిగా పాటించాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు. లేని పక్షంలో సంబంధిత ఉల్లంఘనల కింద కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
ఇక రైళ్లకు సంబంధించి.. రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 145 ప్రకారం పలు శిక్షలు ఉంటాయి. రైలులో లేదా రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఎవరైనా మద్యం సేవించి అసభ్యంగా ప్రవర్తించినట్లు రుజువు అయితే వారిపై చట్టపరంగా కఠిన శిక్షలు విధిస్తారు. మద్యం సేవించడం మాత్రమే కాదు.. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించినా ఈ చట్టం కింద నేరంగా పరిగణిస్తారు.
ఈ రైల్వే చట్టం 1989 ప్రకారం తొలిసారి తప్పు చేస్తే.. ఆ వ్యక్తికి రూ.100 ఫైన్ వేస్తారు. అదే తప్పును మళ్లీ చేసినా.. అసభ్య ప్రవర్తనతో ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే ఒక నెల రోజుల జైలు శిక్ష లేదా రూ.250 జరిమానా విధిస్తారు. కొన్నిసార్లు ఈ రెండు శిక్షలను విధించే అవకాశం ఉంటుంది. మద్యం తాగి హింసకు పాల్పడినా.. రైల్వే సిబ్బందిపై దాడి చేసినా.. గరిష్టంగా 6 నెలల జైలు శిక్ష లేదా రూ.500 జరిమానా లేదా రెండింటినీ వేసే అవకాశం ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa