ఇటీవల మధ్యప్రదేశ్లో కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. చింద్వారా జిల్లాలో ఈ దగ్గుమందు తీసుకోవడం వల్ల 24 మంది చిన్నారులు.. కిడ్నీ ఫెయిలై చనిపోయినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో తెలంగాణ, తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాలు ఈ దగ్గుమందును నిషేధించాయి. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. ఈ మేరకు సోమవారం (నవంబర్ 10) ఔషధ తయారీదారులకు అల్టిమేటం ఇచ్చింది. జనవరి ఒకటి నాటికి ఔషధ తయారీలో అంతర్జాతీయ ప్రమాణాలు పాటించాలని.. లేకపోతే కంపెనీలు మూసుకోవాల్సిందేనని వార్నింగ్ ఇచ్చింది.
2026 జనవరి 1వ తేదీ లోపు గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాక్టిసెస్ ను అన్ని డ్రగ్ తయారీ సంస్థలు పాటించాలని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) ఆదేశించింది. ఈ తేదీపై ఎలాంటి పొడిగింపులు ఉండవని స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రమాణాలను అప్గ్రేడ్ చేసుకోవడానికి చాలా సమయం ఇచ్చామని, సహాయం చేశామని కేంద్రం స్పష్టం చేసింది. కాగా, వార్షిక టర్నోవర్ రూ. 250 కోట్ల కన్నా తక్కువగా ఉన్న 1,470 ఫార్మా తయారీ యూనిట్లను కేంద్రం లక్ష్యంగా చేసుకున్నట్లు అర్థమవుతోంది. దేశంలో ప్రస్తుతం 5,308 డ్రగ్ తయారీ ప్లాంట్లు ఉన్నాయి. అందులో 3,838 ఎమ్ఎస్ఎమ్ఈలు (మైక్రో, స్మాల్, మీడియం కంపెనీలు) ఇప్పటికే అప్గ్రేడ్ చేసిన ప్రమాణాలను పాటిస్తున్నాయి. మిగిలిన 1,470 ఫార్మా తయారీ యూనిట్లు మాత్రం ఇంకా ప్రమాణాలను అప్గ్రేడ్ చేయలేదు.
కేంద్రంపై పెరిగిన ఒత్తిడి..!
భారత్లో తయారైన దగ్గుమందు విదేశాలకు కూడా ఎగుమతి అయ్యింది. గాంబియా, ఉజ్బెకిస్తాన్, కామెరూన్ వంటి దేశాల్లో పిల్లల మరణాలు సంభవించాయి. భారత్లో ప్రభుత్వ నిబంధనల అమలులో నిర్లక్ష్యం, పాత తయారీ విధానాలు అనుసరిస్తున్నారంటూ.. ఆయా దేశాల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ ప్రమాణాలు పాటించని ఔషధ కంపెనీలపై కఠినంగా వ్యవహరించాలని కేంద్రం భావిస్తోంది. ఔషధ తయారీసంస్థలు.. రివైజ్డ్ జీఎమ్పీ నిబంధనల ప్రకారం, కఠినమైన క్వాలిటీ కంట్రోల్ ఉండాలని, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, వార్షిక టర్నోవర్ రూ. 250 కోట్ల కంటే ఎక్కువగా ఉన్న కంపెనీలకు.. జీఎమ్పీ నిబంధనలు 2024 జూన్ 28 నుంచి అమలులోకి వచ్చాయి.
కాగా, చిన్నారుల ప్రాణాలు తీసిన కోల్డ్రిఫ్ దగ్గు మందును కాంచీపురానికి చెందిన శ్రేసన్ ఫార్మా యూనిట్ తయారుచేసింది. ఈ కంపెనీలో తనిఖీలు చేసినప్పుడు.. దగ్గమందులో 48.6 శాతం అత్యంత విషపూరితమైన డైఇథైలిన్ గ్లైకాల్ కలిసినట్లు తేలింది. దగ్గుమందు తయారీలో పర్యవేక్షణ లేమి, సకాలంలో చర్యలు తీసుకోకపోవడంతో విషపూరితమైన సిరప్ మార్కెట్లోకి వచ్చిందని అధికారులు గుర్తించారు. అనంతరం ఈ కంపెనీ అనుమతులను తమిళనాడు ప్రభుత్వం రద్దు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa