ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిద్ధూకు టైమ్ ఇవ్వని కాంగ్రెస్ అధిష్ఠానం.. కర్ణాటక సీఎం మార్పు తథ్యమా?

national |  Suryaa Desk  | Published : Mon, Nov 10, 2025, 07:45 PM

కర్ణాటకలో అధికార మార్పిడిపై ఊహాగానాలు మరోసారి జోరందుకున్నాయి. ఈ నెలలోనే కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది. సీఎం సిద్ధరామయ్య , డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లు తరుచూ ఢిల్లీకి వెళ్లొస్తుండటంతో ఊహాగానాలు మరింత బలపడ్డాయి. ఈ క్రమంలోనే సిద్ధరామయ్య కలిసేందుకు కాంగ్రెస్ పెద్దలు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. నవంబరు నెలాఖరులో కర్ణాటక రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. దీంతో కన్నడ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హస్తినకు వెళ్లి.. ఒక పుస్తక విడుదల కార్యక్రమంలో పాల్గోనున్నారు.


పనిలో పనిగా కాంగ్రెస్ అధిష్ఠానంతో భేటీ అయ్యేందుకు సిద్ధూ అపాయింట్‌మెంట్ కోరగా.. పెద్దలు నిరాకరించినట్టు సమాచారం. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తికావొస్తోన్న వేళ ఈ పరిణామం చోటుచేసుకున్నట్టు ప్రచారం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ పెద్దలు సమయం ఇవ్వడానికి నిరాకరించినా.. సిద్ధరామయ్య మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తికాలం కొనసాగుతుందనే విశ్వాసం వ్యక్తంచేశారు. కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ‘‘మరో రెండున్నరేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. ఆ తర్వాత జరిగే ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కే మళ్లీ ప్రజలు ఓటు వేస్తారనే నమ్మకం నాకు ఉంది’’ అని అన్నారు.


ఇదిలా ఉండగా.. సిద్దూ వర్గానికి చెందిన ఎమ్మెల్యే రాఘవేంద్ర హిట్నాల్‌.. ఢిల్లీలోని తన సోదరుడు, ఎంపీ రాజశేఖర్ హిట్నాల్ నివాసంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు విందు ఏర్పాటు చేశారు. సిద్ధరామయ్య మద్దతుదారులు ఎవరో తెలుసుకోడానికే ఈ విందు నిర్వహించినట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు.. వారంలోనే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రెండుసార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ‘ఓట్ చోరీ’ అంశంపైనే ఆయన ఢిల్లీలో పర్యటిస్తున్నారు.


మరోవైపు, 2023 కర్ణాటక ఎన్నికల అనంతరం సీఎం పీఠంపై అధిష్ఠానం ఇచ్చిన హామీని అమలుచేస్తుందనే ఆశతో డీకే ఉన్నారు. ఆ మాటకు అనుగుణంగా ఏ క్షణంలోనైనా ముఖ్యమంత్రిగా తనకు అవకాశం దక్కుతుందని కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ భావిస్తున్నారు. తొలి విడత క్యాబినెట్ కూర్పులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వర్గం ఎమ్మెల్యేలకే ఛాన్స్ వచ్చింది. తాను సీఎం అయితే.. తన మద్దతుదారులకే పెద్దపీట వేసే దిశగా డీకే శివకుమార్ పావులు కదుపుతున్నారు. బిహార్‌ అసెంబ్లీ ఫలితాలు వెలువడిన తర్వాత విదేశీ పర్యటనకు వెళ్తున్నట్టు రాహుల్‌ గాంధీ ప్రకటించారు. అంతకుముందే మంత్రుల జాబితాను కాంగ్రెస్ అధిష్ఠానానికి పంపించాలని డీకే యోచిస్తున్నారు. కాగా, ఇటీవల సీఎం రామయ్య కుమారుడు యతీంద్ర చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. సిద్ధరామయ్య తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌ను నడిపించే నాయకత్వ లక్షణాలు సతీశ్ జార్ఖిహోళి‌కి ఉన్నాయని వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa