దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని ఫరీదాబాద్లో స్వాధీనం చేసుకున్న 350 కిలోల పేలుడు పదార్థాల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏకే 47 రైఫిల్, పిస్టల్, పేలుడు పదార్థాలను దాచ్చిపెట్టిన కారు నిందితుడు ముజామ్మిల్ షకీల్తో ఫరీదాబాద్ ఆసుపత్రిలో పనిచేస్తోన్న మహిళా వైద్యురాలిదిగా అధికారులు గుర్తించారు. షకీల్ను ప్రశ్నించిన తర్వాత హర్యానా రిజిస్ట్రేషన్ ఫరీదాబాద్ కోడ్తో ప్రారంభమయ్యే మారుతి సుజుకి స్విఫ్ట్ను పోలీసులు తనిఖీ చేశారు. విచారణలో ఆయన వెల్లడించిన సమాాచారంతో అమ్మోనియం నైట్రేట్గా అనుమానిస్తున్న 350 కిలోల పేలుడు పదార్థం, 20 టైమర్లు, ఇతర అనుమానాస్పద వస్తువులను కనుగొన్నారు. అద్దెకు ఉంటోన్న నివాసంలో ఈ కారును స్వాధీనం చేసుకున్నారు. దేశంలో భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్రచేసినట్టు అనుమానిస్తున్నారు.
పోలీసులు అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం... ఫరీదాబాద్లోని అల్-ఫలాహ్ స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రిసెర్చ్ సెంటర్లో షకీల్ గత మూడేళ్ల నుంచి సీనియర్ డాక్టర్గా పనిచేస్తున్నాడు. క్యాంపస్లోనే అతడు ఉంటున్నా.. ధోజ్లో ఓ గదిని అద్దెకు తీసుకున్నాడు. అనుమానాస్పద కార్యకలాపాలపై పక్కా సమాచారం అందడంతో పది రోజుల కిందటే పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. అద్దెకు తీసుకున్న గది, కారు మహిళా డాక్టర్వేనని అతడు విచారణలో వెల్లడించాడు. పోలీసులు అతడి గదిలో సోదాలు నిర్వహించినప్పుడు 8 పెద్ద సూట్కేసులు, మరో నాలుగు సూట్కేసుల్లో అమ్మోనియం నైట్రేట్ వంటి పేలుడు పదార్థాలు గుర్తించారు.
జమ్మూ కశ్మీర్, హర్యానా పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్లో ఏకే 47 అసల్ట్ రైఫిల్, మ్యాగజైన్లు, 83 లైవ్ రౌండ్లు, పిస్టల్, 2 ఎంప్టీ క్యాంట్రిడ్జెస్, 2 అడిషినల్ మ్యాగజైన్లను కారులో స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఆమె పాత్రను తేల్చడానికి ప్రయత్నిస్తున్న పోలీసులు.. మహిళా వైద్యురాలిని ప్రశ్నిస్తున్నారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 350 కిలోల పేలుడు పదార్థం షకీల్కు రెండు వారాల కిందటే చేరింది. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్తో అతడికి సంబంధాలు ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ, ఢిల్లీకి సమీపంలో అంత పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు ఎందుకు దాచిపెట్టారు? ఎవరి కంటబడకుండా అవి ఎలా చేరుకున్నాయి? అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, అక్టోబరు 27న శ్రీనగర్లో జైషే ఉగ్రవాద సంస్థకు మద్దతుగా పోస్టర్లు వెలసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై విచారణ చేపట్టిన స్థానిక పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్లో పోస్టర్లను అతికించిన రథేర్గా గుర్తించి, ఉత్తర్ ప్రదేశ్లో సహారన్పూర్లో గతవారం అరెస్ట్ చేశారు. అతడు గతేడాది అక్టోబరు వరకూ అనంత్నాగ్ మెడికల్ కాలేజీలో పనిచేసినట్టు గుర్తించారు. అనంత్నాగ్లోని అతడి లాకర్ తనిఖీ చేయగా.. రైఫిల్ బయటపడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa