సంపాదిస్తున్నప్పుడే రిటైర్మెంట్ గురించి ఆలోచన చేయాలని, అందుకు తగినట్లుగా సరైన మార్గాన్ని ఎంచుకుని పెట్టుబడి పెట్టాలని ఆర్థిక నిపుణులు సూచిస్తుంటారు. ప్రతి ఏటా ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతోంది. అంటే వచ్చే 20-30 ఏళ్లలో డబ్బుల విలువ భారీగా పడిపోనుంది. అందుకు తగినట్లుగా రాబడులు వచ్చేలా పెట్టుబడి పెట్టకపోతే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. పదవీ విరమణ తర్వాత ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవితం సాఫీగా సాగేందుకు నెల నెలా స్థిరమైన రాబడి వచ్చే మార్గం ఉండాలి. అలాగే పెద్ద మొత్తంలో డబ్బులు చేతిలో ఉంటే ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఈ రెండు లక్ష్యాలను ఒకేసారి నెరవేర్చే అద్భుతమైన స్కీమ్ ఒకటి అందుబాటులో ఉంది.
అదే కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న నేషనల్ పెన్షన్ సిస్టమ్. కేంద్రం ఆధ్వర్యంలో పోస్టాఫీసు ద్వారా ఈ పథకంలో చేరవచ్చు. దీని ద్వారా రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన ఆదాయం లభిస్తుంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA) ఈ పథకాన్ని పర్యవేక్షిస్తుంది. కేంద్రం భరోసా ఉంటుంది కాబట్టి ఎలాంటి భయం లేకుండా ఇందులో ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే, ఇది మార్కెట్కు లింక్ అయి ఉంటుంది. అందుకు తగినట్లుగానే రాబడులు ఉంటాయని గమనించాలి. ఇన్వెస్టర్లు తమ రిస్క్ ప్రొఫైల్, భవిష్యత్తు ఆర్థిక లక్ష్యాల ఆధారంగా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.
దీర్ఘకాలిక రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించేలా ఎన్పీఎస్ స్కీమ్ రూపొందించారు. క్రమం తప్పకుండా ఇందులో ఇన్వెస్ట్ చేస్తే పెద్ద మొత్తంలో కార్పస్ ఏర్పడుతుంది. 60 ఏళ్ల వయసు వచ్చాక క్యాపిటల్ మొత్తంలో 60 శాతం ట్యాక్స్ ఫ్రీగా చేతికి అందుతుంది. మిగిలిన 40 శాతం యాన్యుటీ స్కీమ్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంటే పెన్షన్ కోసం పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఎన్పీఎస్లో టైర్- I, టైర్- II అని రెండు రకాల అకౌంట్లు ఉంటాయి. టైర్ I ప్రధాన రిటైర్మెంట్ అకౌంట్గా పని చేస్తుంది. ఇందులో ట్యాక్స్ బెనిఫిట్స్ లభిస్తాయి. టైర్ II వాలంటరీ సేవింగ్స్ అకౌంట్ ఇందులో డబ్బులు అవసరమైనప్పుడు వెనక్కి తీసుకోవచ్చు. ఇందులో ట్యాక్స్ బెనిఫిట్స్ ఉండవు.
30 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి ఎన్పీఎస్లో నెలకు రూ.5,000 చొప్పన పెట్టుబడి ప్రారంభించాడు అనుకుందాం. అతడికి 60 ఏళ్ల వయసు వచ్చే వరకు ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. దీనిపై సగటు వార్షిక రాబడి 10 శాతం వస్తుందని అంచనే వేయొచ్చు. అతడి మొత్తం పెట్టుబడి రూ.18 లక్షలు అవుతుంది. 30 సంవత్సరాల తర్వాత వడ్డీ, అసలు కలిపి దాదాపు రూ.1.13 కోట్ల వరకు అందుతుంది. రిటైర్మెంట్ తర్వాత ఇందులో 60 శాతం (దాదాపు రూ.68 లక్షలు) ట్యాక్స్ ఫ్రీగా చేతికి అందుతాయి. మిగిలిన 40 శాతం సుమారు రూ.45 లక్షలు పెట్టి యాన్యుటీ స్కీమ్ కొనుగోలు చేయాలి. ఈ యాన్యుటీ స్కీమ్ ద్వారా సగటుగా 6 శాతం రాబడి వస్తుందని అంచనా వేస్తే జీవితాంతం నెలకు రూ.22,000 వరకు పెన్షన్ అందుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa