ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం.... ఏపీలో మహిళలకు రూ. 50 లక్షలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 14, 2025, 07:35 PM

మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఇటీవల అన్నారు. ఈ మేరకు మహిళలే స్వయంగా పరిశ్రమలు పెట్టి స్వశక్తితో ఎదగాలని.. వారికి అన్ని విధాలా అండగా నిలబడుతోంది కూటమి ప్రభుత్వం. అందులో భాగంగా మహిళలు స్వయం ఉపాధికి రాయితీపై రుణాలు అందిస్తోంది. గ్రామీణ మహిళలకు బ్యాంకు లింకేజీ ఆధారంగా ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ ప్రోగ్రాం కింద గరిష్ఠంగా రూ. 50 లక్షల వరకు రుణాలు ఇస్తోంది. మైక్రో పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల పెట్టుకోవాలనుకునేవారికి రూ. 10 లక్షల వరకు లోన్లు అందిస్తోంది. ఈ రెండు రకాల లోన్లకు 35 శాతం రాయితీ ఇస్తోంది.


కాగా, ఇప్పటికే రాష్ట్రంలో పలు మహిళా సంఘాల సభ్యులు ఇలాంటి ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటు చేశారు. వస్తువులు ఉత్పత్తి చేస్తున్నా.. వాటికి సరైన మార్కెటింగ్‌ సౌకర్యం ఉండేది కాదు. దీంతో స్థానికంగానే ఎంతోకొంతకు అమ్ముకోవాల్సి వచ్చేది. ఈ సమస్యకు చెక్ పెడుతూ.. ప్రభుత్వమే ఆన్‌లైన్‌ ద్వారా మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తోంది.


ఈ ఉత్పత్తులు తయారీ చేసుకోవచ్చు..


మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు బ్యాంకు లింకేజీ కింద ఉత్పత్తి యూనిట్ల స్థానిపించేందకు లోన్లు పొందొచ్చు. పీఎంఈజీపీ పథకం కింద చిన్న తయారీ పరిశ్రమలకు రూ. 50 లక్షల వరకు రుణం ఇస్తారు. ఇక సర్వీసు యూనిట్లకు రూ. 20 లక్షల వరకు అందిస్తారు. ఇక వ్యక్తిగతంగా స్వయం ఉపాధి కోసం రూ. 3 లక్షల వరకు రుణం మంజూరు చేస్తున్నారు. అయితే మహిళలు.. పచ్చళ్లు, కారం, మల్టీగ్రెయిన్‌ పిండి, తేనె, గానుగ నూనె, ఫినాయిల్, బూత్రూమ్ క్లీనర్లు, చీపుర్లు, బేకరి ఉత్పత్తులు, నూడిల్స్‌ ప్యాకెట్లు వంటి ఉత్పత్తుల తయారీ కోసం యూనిట్లు ఏర్పాటు చేయడానికి రుణం పొందొచ్చు. అంతేకాకుండా సెంట్రింగ్, కారు ట్రావెల్స్, టెంట్‌హౌస్‌లు, డీజే సౌండ్‌ సిస్టం వంటి సర్వీసు అందించే యూనిట్లు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.


ఇప్పటికే ఉన్న యూనిట్లకు PMEGP కింద రుణాలు రావు. కొత్తగా ఏర్పాటు చేయాలనుకునే వారికి రుణాలు అందిస్తారు. అయితే యూనిట్ పెట్టాలనుకునేవారికి 18 ఏళ్లు నిండి ఉండాలి. అర్బన్ లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఈ యూనిట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ యూనిట్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే.. ప్రభుత్వం ఇచ్చే పథకాల నుంచి లబ్ధి పొందినవారై ఉండకూడదు. దరఖాస్తు కోసం డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్) తయారు చేయాలి. PMEGP ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా.. అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించి దరఖాస్తు చేయాలి. ప్రాజెక్టు మంజూరు అయితే.. KVIC/KVIB/DIC నిర్వహించే ట్రైనింగ్‌కు హాజరు కావాలి. అనంతరం మహిళా సంఘాల షేర్ బ్యాంకులో జమ చేస్తే.. PMEGP లోన్ వస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa