ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం మనల్ని నడిపించకూడదని, మనమే ఏఐ విప్లవానికి నాయకత్వం వహిద్దామని మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా రెండోరోజైన శనివారం ‘ఏఐ, ఉద్యోగాలు భవిష్యత్తు- అంతరాలను, అవకాశాలను మార్చడం’ అనే అంశంపై నిర్వహించిన సెషన్లో మంత్రి కీలకోపన్యాసం చేశారు. ఏఐ విప్లవంలో భాగస్వాములయ్యేందుకు మూడు విధాలుగా సన్నద్ధమవుదామని పిలుపునిచ్చారు. రీ-స్కిల్లింగ్, రీ-డిఫైనింగ్, రీ-ఇమేజనింగ్ అని మూడు ‘ఆర్’ ఫార్ములాను ఆయన ప్రతిపాదించారు. రీ-స్కిల్లింగ్లో భాగంగా ఏఐ సాంకేతికతలో ప్రస్తుతం అన్నిరంగాల్లో ఉన్న నిపుణుల నైపుణ్యాలను మెరుగుపరచాలని అన్నారు. అందులో భాగంగా ఏపీ ప్రభుత్వం నైపుణ్యం అనే ప్లాట్ఫాంను తయారుచేసిందని చెప్పారు. రీ-డిఫైనింగ్లో భాగంగా ఏఐ, మానవ మేధస్సు సహకారంతో ఉత్పత్తి రంగంలో మార్పులు తీసుకురావాలన్నారు. రీ-ఇమేజింగ్లో అసమానతలను సంప్రదాయ కోణంలో కాకుండా ఏఐ కోణంలో చూడాలని తెలిపారు. మనుషుల్లో అసమానతలకు ఏఐ కారణం కాకూడదని, వాటిని తొలగించే వారధి కావాలని ఆకాంక్షించారు. ఏఐ కారణంగా రానున్న రోజుల్లో ఉద్యోగాల కోత వంటి భయాలు అవసరం లేదని, దీనివల్ల ఉత్పన్నమవుతున్న ప్రశ్నలు, భయాలకు వచ్చే ఐదేళ్లలో ఏపీ ఒక సమాధానంగా నిలుస్తుందని స్పష్టంచేశారు. కార్యక్రమంలో ‘ఏఐ ఈజ్ రెడీ ఫర్ ఏజెంటిక్ ఏఐ’ అనే నివేదికను ఆవిష్కరించారు. అనంతరం రానున్న ఐదేళ్లలో 30వేల మంది యువతకు నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్, సీఐఐ భాగస్వామ్యంతో విజయవాడలో మోడల్ కెరీర్ సెంటర్ ఏర్పాటుపై ఏంవోయూ చేసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa