ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెల్లి అవమానాన్ని సహించలేనన్న అన్న తేజ్ ప్రతాప్

national |  Suryaa Desk  | Published : Sun, Nov 16, 2025, 09:32 PM

బీహార్ రాజకీయాల్లో కీలకమైన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. లాలూ కుమార్తె రోహిణి ఆచార్య రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం కలకలం రేపింది. ఎన్నికల ఓటమిపై ప్రశ్నించినందుకు తనను అవమానించి, ఇంటి నుంచి గెంటేశారని ఆమె ఆరోపించారు. ఈ పరిణామంపై ఆమె సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. తన సోదరిని అవమానించిన వారిని గొయ్యి తీసి పాతి పెడతా అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ ఘోర పరాజయానికి గల కారణాలను ప్రశ్నించిన తర్వాత తనను తీవ్రంగా అవమానించారని రోహిణి ఆరోపించారు. తన తండ్రికి కిడ్నీ దానం చేసిన విషయాన్ని అడ్డం పెట్టుకుని, పార్టీ టికెట్ కోసమే అలా చేశానని ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తేజస్వి యాదవ్ సన్నిహితుల ఆదేశాలతోనే ఇదంతా జరిగిందని ఆమె ఆరోపణలు చేశారు. ఈ ఘటనల తర్వాత రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు.సోదరి ఉదంతంపై తేజ్ ప్రతాప్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. నాకు జరిగిన అవమానాన్ని నేను భరించాను. కానీ నా సోదరికి జరిగిన అవమానాన్ని సహించలేను. మా కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్న ద్రోహులను బీహార్ ప్రజలు క్షమించరు అని హెచ్చరించారు. ఈ క్రమంలో తన తండ్రి లాలూ యాదవ్‌కు భావోద్వేగ పిలుపునిచ్చారు. నాన్నా, ఒక్క సంకేతం ఇవ్వండి చాలు. ఈ ద్రోహులను ప్రజలే ఖననం చేస్తారు. ఇది పార్టీల పోరాటం కాదు, కుటుంబ గౌరవం, ఆడబిడ్డల ఆత్మగౌరవం కోసం పోరాటం అని పేర్కొన్నారు.ఈ కుటుంబ వివాదంపై ఇతర పార్టీలు స్పందించాయి. జేడీయూ దీన్ని యాదవ్ ఇంట్లో మహాభారతంగా అభివర్ణించగా, ఆర్జేడీ మాత్రం ఇది కుటుంబ అంతర్గత విషయమని పేర్కొంది. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత యాదవ్ కుటుంబంలో మొదలైన ఈ అంతర్గత కలహాలు పార్టీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa