రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు ఒక వ్యక్తి కాదని, ఆయన ఒక శక్తిమంతమైన వ్యవస్థ అని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అభివర్ణించారు. స్వయంకృషి, క్రమశిక్షణ, పట్టుదలతో అనేక రంగాల్లో అద్భుత విజయాలు సాధించి, భావి తరాలకు మార్గదర్శకంగా నిలిచిన మహోన్నత వ్యక్తి అని ఆయన కొనియాడారు. రామోజీరావు పేరిట ఏర్పాటు చేసిన రామోజీ ఎక్స్లెన్స్ జాతీయ అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం రామోజీ ఫిల్మ్సిటీలో అత్యంత వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమానికి హాజరైన వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, "రామోజీరావు లేని ఆయన సంస్థలను ఊహించుకోలేకపోతున్నాను. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, అదొక శక్తి. జనహితమే జర్నలిజం అని నమ్మి ఆచరించిన మహామనీషి. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి, ప్రపంచమంతా తెలుగువారి వైపు చూసేలా ఎదిగిన ఆయన జీవితం యువతకు గొప్ప స్ఫూర్తి. ఆయన సంస్థల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎందరో లబ్ధి పొందారు. తెలుగు ప్రజల హృదయాల్లో ఆయన స్థానం శాశ్వతం" అని పేర్కొన్నారు. ప్రజా జీవితంపై రామోజీరావు వేసినంత బలమైన ముద్ర ఇటీవలి కాలంలో మరెవరూ వేయలేదని ఆయన అన్నారు.విభిన్న రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులను రామోజీరావు జయంతి సందర్భంగా సత్కరించడం అభినందనీయమని వెంకయ్యనాయుడు అన్నారు. "రామోజీరావు కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు, తెలుగు జాతి కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన క్రాంతి దర్శి. సామాజిక నిబద్ధత అనే పునాదిపై తన విజయ సౌధాన్ని నిర్మించుకున్నారు. ఆయన పత్రికను ధర్మయుద్ధం కోసం ఉపయోగించారు. తెలుగు పోతే వెలుగు లేదు. మన మాతృభాషను కాపాడుకోవడమే మనం రామోజీరావుకు ఇచ్చే నిజమైన నివాళి" అని ఆయన ఉద్ఘాటించారు.ఈ కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, రామ్ మోహన్ నాయుడు, బండి సంజయ్ తదితరులు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa