ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉగ్రదాడుల వేళ మదర్సాలకు కొత్త నిబంధనలు

national |  Suryaa Desk  | Published : Wed, Nov 19, 2025, 08:30 PM

ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దేశ రాజధాని ఢిల్లీలో.. ఎర్ర కోట సమీపంలో పేలుడు జరిగింది. ఇందుకు బాధ్యులైన వారు ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా ఉగ్రవాదులను ఏరి వేయడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఉగ్రదాడులు మాత్రమ ఆగడంలేదు.పైగా ఉగ్రమూకలు ఆత్మాహుతి దాడులకు పాల్పడుతూ.. అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. ఉగ్రవాదులు, వారి సానుభూతి పరులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. ఇదిలా ఉంటే దేశంలో ఉగ్రదాడి వేళ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మదర్సాలకు సంబంధించి కొత్త నిబంధనలు తీసుకువచ్చింది.


దేశంలో తరచుగా ఉగ్రదాడులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో.. భద్రతా సంస్థలను అప్రమత్తం చేయడానికి గాను ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్న యోగి ప్రభుత్వం కొత్త ప్రోటోకాల్‌ను అమలు చేసేందుకు ముందుకు వచ్చింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మదర్సాలలో ఉండే విద్యార్థులు, మౌలానాల పూర్తి వివరాలను ఉగ్రవాద నిరోధక దళం (ATS)కి అందివ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ తర్వాత.. భద్రతా దళాలు.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో దర్యాప్తును విస్తరిస్తున్న సమయంలో యూపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.


కొత్త ఉత్తర్వుల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గుర్తింపు పొందిన, పొందని మదర్సాలు .. తమ వద్ద పనిచేస్తున్న మత బోధకులు, ఉపాధ్యాయులు వివరాలను ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అలానే వారి మొబైల్ నంబర్, ఆధార్, శాశ్వత చిరునామాతో పాటుగా ఇతర గుర్తింపు పత్రాలను కూడా ATS అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. అదేవిధంగా, మదర్సాలలో చదువుతున్న విద్యార్థులు కూడా వారికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించాలి. ఇది కేవలం డేటా సేకరణ, సర్వే మాత్రమే కాదని.. ఏదైనా సంస్థలో చోటు చేసుకునే అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించడానికి కూడా సాయం చేస్తుందని అధికారులు తెలిపారు.


గత కొన్ని నెలలుగా కొన్ని మదర్సాలు, ఇతర ప్రైవేట్ మతపరమైన సంస్థలలోకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే యువత సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఈక్రమంలో మదర్సాలకు సంబంధించిన పూర్తి వివరాలను ధృవీకరణను నిర్వహించే బాధ్యతను యోగి ప్రభుత్వం ATSకి అప్పగించింది.


ఢిల్లీ బాంబు బ్లాస్ట్ ఘటన దర్యాప్తు సమయంలో.. లక్నోలోని ఇంటిగ్రల్ విశ్వవిద్యాలయంలోని పని చేసే లెక్చరర్ పర్వేజ్ అన్సారీ పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ విశ్వవిద్యాలయం కూడా పరిశీలనకు గురైంది. ఆ తర్వాత జమ్మూ కశ్మీర్‌కు చెందిన ప్రొఫెసర్ల గుర్తింపు పత్రాలను పమర్పించాలని నిఘా సంస్థలు యూనివర్శిటీ అడ్మినిస్ట్రేషన్‌ను ఆదేశించాయి. విశ్వవిద్యాలయంలో చదువుతున్న జమ్మూ కాశ్మీర్ విద్యార్థుల రికార్డులను కూడా సమర్పించారు. అలానే విశ్వవిద్యాలయంలో.. చదువుతున్న విదేశీ విద్యార్థుల సంఖ్య, వారు చదువుతున్న కోర్సులు ఇతర వివరాలను కూడా నిఘా విభాగానికి సమర్పించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa