ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెంపుడు కుక్కను కాల్చి చంపిన పోలీస్.. యజమానికి రూ.4.4 కోట్ల పరిహారం

international |  Suryaa Desk  | Published : Wed, Nov 19, 2025, 08:51 PM

అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రంలో గల స్టర్జన్ నగరంలో ఒక పోలీసు అధికారి టెడ్డీ అనే పెంపుడు కుక్కను కాల్చి చంపిన సంఘటనపై, నగర పాలక మండలి ఆ కుక్క యజమానికి 5 లక్షల డాలర్లు అంటే మన భారత కరెన్సీలో సుమారు రూ.4.4 కోట్లు పరిహారం చెల్లించడానికి అంగీకరించింది. 5 ఏళ్ల షిట్-జూ జాతికి చెందిన టెడ్డీకి చెవులు వినిపించకపోగా.. కంటి చూపు కూడా లేదు. అయితే గతేడాది మే నెలలో టెడ్డీ.. తన యజమాని స్థలం నుంచి పొరుగు ఇంటి ఆవరణలోకి వెళ్లింది. దీంతో పొరుగింటి వారు పోలీసులకు ఫోన్ చేయగా.. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారి మైరాన్ వుడ్‌సన్.. టెడ్డీని పట్టుకోలేకపోయారు. దీంతో కుక్కను వెనుక నుంచి రెండుసార్లు కాల్పులు జరిపాడు. దీంతో అది చనిపోయింది. దీనిపై టెడ్డీ ఓనర్ నికోలస్ హంటర్.. కోర్టులో దావా వేయగా.. స్టర్జన్ నగర పాలక మండలి సెటిల్‌మెంట్‌కు అంగీకరించింది.


2024 మే నెలలో టెడ్డీ అనే ఐదేళ్ల షిట్-జూ బ్రీడ్‌కు చెందిన పెంపుడు కుక్క హత్యకు గురైంది. దానికి చెవులు వినిపించకపోవడంతోపాటు.. కంటి చూపు కూడా లేదు. అయితే ఆ సమయంలో దాని యజమాని నికోలస్ హంటర్.. భోజనం చేస్తుండగా.. టెడ్డీ తమ కంచె దాటి పొరుగువారి ఇంటి ఆవరణలోకి వెళ్లింది. స్టర్జన్ నగరంలో జంతువుల నియంత్రణ పోలీసుల బాధ్యత కావడంతో.. వారు పోలీసులకు ఫోన్ చేసి పిలిపించారు. ఇక సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు అధికారి మైరాన్ వుడ్‌సన్.. ఆ కుక్కను పట్టుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నించి విఫలమయ్యాడు. అయితే ఆ పోలీస్‌కు ఉన్న బాడీక్యామ్ ఫుటేజ్ ప్రకారం.. ఆ కుక్కను పట్టుకోవడానికి తీవ్ర విసుగు చెందిన మైరాన్ వుడ్‌సన్.. తన వద్ద ఉన్న తుపాకీ తీసి.. దూరంగా వెళ్తున్న టెడ్డీపై రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు.


ఈ వివాదం కాస్తా తీవ్రం కావడంతో.. మొదట్లో టెడ్డీకి రేబిస్ వ్యాధి ఉండవచ్చనే అనుమానంతోనే వుడ్‌సన్ కాల్చాడని స్టర్జన్ నగర పాలక మండలి సమర్థించింది. అప్పటి మేయర్ కెవిన్ అబ్రహమ్సన్ కూడా పోలీస్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించారు. కానీ తర్వాత ఆయన హఠాత్తుగా రాజీనామా చేయడం.. కొత్తగా వచ్చిన నగర మేయర్ వుడ్‌సన్‌ను సస్పెండ్ చేయగా.. అతను చివరికి పోలీస్ శాఖను విడిచిపెట్టాడు.


ఇక ఆ టెడ్డీ యజమాని నికోలస్ హంటర్ 1 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ పరిహారం ఇవ్వాలని.. కోరుతూ అమెరికా జిల్లా కోర్టులో దావా వేశారు. దీంతో ఆ నగర పాలక మండలి.. ఈ కేసును పరిష్కరించడానికి అంగీకరించింది. మొత్తం 5 లక్షల డాలర్ల పరిహారంలో.. 2.82 లక్షల డాలర్ల నేరుగా హంటర్‌కు.. మిగిలిన 21.7 లక్షల డాలర్లు అతని లాయర్లకు చెందుతాయని తెలిపింది. చనిపోయిన టెడ్డీని తిరిగి తీసుకురాలేనప్పటికీ.. ఈ కేసు ముగిసినందుకు దాని యజమని హంటర్‌కు రిలీఫ్ పొందారు.


యానిమల్ లీగల్ డిఫెన్స్ ఫండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ క్రిస్ గ్రీన్ ఆ వ్యవహారంపై స్పందించారు. ఈ సెటిల్‌మెంట్ చారిత్రాత్మకమని, ఇతర పోలీసు శాఖలకు కూడా దీని వల్ల ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపుతుందని తెలిపారు. పోలీసులు అనవసరంగా ఒక జంతువుకు హాని చేస్తే.. భారీ మూల్యం చెల్లించుకోవాలని ఈ తీర్పు చెబుతోందని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa