ప్రపంచంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా.. చాలా వరకు అందరి అనుమానాలు పాకిస్తాన్ మీదకే వెళ్తాయి. పాకిస్తాన్ ఉగ్రవాదులకు పుట్టిల్లు అనేది జగమెరిగిన సత్యం. ప్రపంచదేశాలు, సంస్థలు ఈ విషయంలో పాక్కు చీవాట్లు పెట్టినా.. అది మాత్రం పెద్దగా తలకెక్కించుకోదు.. తన తీరు మార్చుకోదు. ఈక్రమంలో తాజాగా ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ ముఖ్యమంత్రి పాకిస్తాన్ మీద సంచలన ఆరోపణలు చేశారు. పాక్ ప్రభుత్వమే ఉగ్రదాడులు చేయిస్తోంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రిది తాజాగా మన దాయాది దేశం పాకిస్తాన్ మీద సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయ అజెండాలో భాగంగానే పాక్ ప్రభుత్వం నకిలీ ఉగ్ర దాడులు చేయిస్తోందన్నారు. అఫ్రిది ఈ వ్యాఖ్యలు చేసినట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. వీటి ప్రకారం.. నెల రోజుల క్రితం అనగా 2025, అక్టోబర్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అఫ్రిది.. బాధ్యతలు స్వీకరించిన అనతి కాలంలోనే పాక్ మీద సంచలన ఆరోపణలు చేయడం గమనార్హం అంటూ వార్తలు వెల్లడించాయి.
పాక్ ప్రభుత్వం.. ఖైబర్ ప్రాంతంలో కావాలనే ఉద్దేశపూర్వకంగా ఉగ్రవాద దాడులు జరిపిస్తోందని అఫ్రిది ఆరోపించారు. ఈ ప్రాంతంలో శాంతి స్థాపనకు తాము చేస్తోన్న ప్రయత్నాలను అడ్డుకుంటుందని తెలిపారు. ఇటీవల ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమానికి పష్తూన్ తహాఫుజ్ మూమెంట్ (పీటీఎం) సభ్యులు హాజరు కాగా.. వారిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనను ఆఫ్రిది తీవ్రంగా ఖండించారు. తమ ప్రాంతంలో శాంతి స్థాపనను అడ్డుకోవడమే కాక.. ఆఫ్గనిస్తాన్తో తమ ప్రావిన్స్కు మధ్య ఏర్పడిన సంబంధాలను దెబ్బతీసేందుకే.. పాకిస్తాన్ కావాలనే ఇలాంటి పనులు చేస్తోందని ఆయన ఆరోపించారు.
అయితే తాను ఇలాంటి వ్యక్తులు, సంఘటనలకు ఏమాత్రం భయపడనని.. తమ నాయకుడు, మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్లాగానే ధైర్యంగా ఎదుర్కొంటానని అఫ్రిది తెలిపారు. తాము శాంతి స్థాపనకు చేస్తోన్న ప్రయత్నాలను అడ్డుకునే వారిని ఉమ్మడి శత్రువుగా పరిగణిస్తామని హెచ్చరించారు. అలానే ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతాల్లో నిర్వహిస్తోన్న సైనిక కార్యకలాపాలను సైతం ఆయన విమర్శించారు. ఉగ్రవాదుల ఏరివేత పేరుతో.. సాయుధ దళాలు.. సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకుని.. వారిని ఇబ్బంది పెడుతున్నారని.. హతమారుస్తున్నారని అఫ్రిది విమర్శించారు.
సాయుధ దళాలు తమ చర్యలను ఉగ్రవాదంపై యుద్ధం అని పేర్కొంటున్నాయి.. కానీ వారు తమ సొంత ప్రజలనే చంపుతున్నారని అఫ్రిది మండిపడ్డారు. ఇటీవల పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని తిరా లోయలో పాక్ వైమానిక దాడులు చేయడంతో.. ఈ ఘటనలో మహిళలు, చిన్నారులతో సహా 30 మంది చనిపోయారు.దీన్ని దృష్టిలో పెట్టుకునే అఫ్రిది పాకిస్తాన్ మీద ఇలాంటి ఆరోపణలు చేశారని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa