ఆంధ్రప్రదేశ్లో 15 నుంచి 59 ఏళ్ల వయసు వారిలో నిరక్షరాస్యతను పూర్తిగా తుడిచిపెట్టేందుకు విద్యాశాఖ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘అక్షరాంధ్ర’ పేరుతో ప్రారంభమవుతున్న ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది పెద్దలు మళ్లీ పుస్తకం తెరిచి చదువుకోవడం, రాయడం నేర్చుకోబోతున్నారు. ఇది కేవలం అక్షరాలు నేర్పడమే కాదు, జీవితాన్ని స్వతంత్రంగా నడిపించే ఆత్మవిశ్వాసాన్ని కూడా ఇస్తుంది.
ప్రాథమికంగా చదవడం, రాయడం, సాధారణ కూడికలు-తీసివేతలు నేర్పించడమే లక్ష్యం కాదు, ఈ రోజుల్లో అందరికీ అవసరమైన డిజిటల్ అవగాహన, ఆర్థిక లావాదేవీలు, ఆరోగ్య జాగ్రత్తలు, న్యాయపరమైన హక్కుల గురించి కూడా వివరంగా తెలియజేయనున్నారు. ఈ కార్యక్రమం గ్రామీణ మహిళలు, కార్మికులు, రైతాంగం వంటి వర్గాలకు ప్రత్యేకంగా ఉపయోగపడనింది. మొబైల్ బ్యాంకింగ్ నుంచి ఆన్లైన్ సేవల వరకు అన్నీ స్వయంగా నిర్వహించే స్థాయికి వీరిని తీసుకొచ్చే ప్రయత్నమిది.
తరగతులను అందుబాటులోనే ఏర్పాటు చేయడానికి అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లను వినియోగించుకోనున్నారు. సాయంత్రం లేదా వారాంతాల్లో తరగతులు నిర్వహించి, రోజువారీ పనులకు ఆటంకం కలగకుండా చూస్తారు. స్థానిక స్వయంసేవకులు, ఉపాధ్యాయులతోపాటు ప్రత్యేకంగా శిక్షణ పొందిన వాలంటీర్లు బోధనలో పాల్గొంటారు.
ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 81 లక్షల మంది నిరక్షరాస్యులుగా గుర్తించగా, ప్రతి సంవత్సరం 25 లక్షల మందికి శిక్షణ ఇచ్చి క్రమంగా నిరక్షరాస్యతను శూన్యం చేయడమే ప్రభుత్వ లక్ష్యం. ఈ మహా ఉద్యమం విజయవంతమైతే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నిరక్షరాస్యత రహిత రాష్ట్రంగా చరిత్ర సృష్టించనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa