ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ కాష్ పటేల్‌పై వేటు పడనుందా

international |  Suryaa Desk  | Published : Wed, Nov 26, 2025, 09:24 PM

భారత సంతతికి చెందిన కాష్ పటేల్ అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈయనను ఆ పదవి నుంచి అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలో తొలగించనున్నారంటూ అమెరికన్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. తాజాగా దీనిపై ట్రంప్ స్పందించారు. ముఖ్యంగా వైట్‌హౌస్ ఈ వార్తలన్నీ అవాస్తవమైనవేనని కొట్టిపారేసింది. ఈ మేరకు ట్రంప్, పటేల్‌లు కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఆయన పదవిలోనే కొనసాగుతున్నారని చెప్పారు.


కాష్ పటేల్‌ను డైరెక్టర్ పదవి నుంచి తొలగించి.. ఆ బాధ్యతలను కో-డిప్యూటీ డైరెక్టర్ ఆండ్రూ బెయిలీకి అప్పగించనున్నారని వార్తలు వచ్చాయి. దీనిపై వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ లీవిట్ స్పందిస్తూ.. "ఆ వార్తలన్నీ పూర్తిగా అవాస్తవాలు, కల్పితమైనవి. అధ్యక్షుడికి ఆ వార్తలు నవ్వు తెప్పించాయి" అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. పటేల్‌లపై తనకు చాలా నమ్మకం ఉందని ట్రంప్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్వయంగా ప్రశంసలు కురిపించిన నేపథ్యంలో ఈ వార్తలు రావడం గమనార్హం.


అయితే కాష్ పటేల్‌పై ఇటీవల పలు ఆరోపణలు రావడంతోనే ఈ తొలగింపు పుకార్లు ఊపందుకున్నాయి. ఎఫ్‌బీఐ మాజీ ఏజెంట్ కైల్ సెరాఫిన్ ఆరోపణల ప్రకారం.. కాష్ పటేల్ తన ప్రియురాలి కచేరీని చూసేందుకు 60 మిలియన్ డాలర్ల విలువైన ప్రభుత్వ విమానాన్ని ఉపయోగించారు. భద్రతా కారణాల రీత్యా డైరెక్టర్‌లు అధికారిక విమానాన్ని వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించినా, అందుకు అయ్యే ఖర్చులను ప్రభుత్వానికి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అయితే పటేల్ ఆ ఖర్చులను చెల్లించడం లేదని ఆరోపణలు వచ్చాయి. గతంలో కూడా ఆయన అనేక వ్యక్తిగత పర్యటనలకు ప్రభుత్వ విమానాన్ని వినియోగించారని ప్రచారం జరిగింది.


ఇది మాత్రమే కాకుండా పటేల్ బ్యూరో హెడ్‌క్వార్టర్స్‌లో కంటే నైట్‌క్లబ్స్‌లోనే ఎక్కువగా ఉంటున్నారని ఎఫ్‌బీఐ కౌంటర్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఫ్రాంక్ ఫిగ్లీజీ విమర్శించారు. అలాగే హై ప్రొఫైల్ కేసుల దర్యాప్తు సమయంలో డైరెక్టర్‌గా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై కూడా పటేల్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణల నేపథ్యంలోనే ట్రంప్ ఆయనపై వేటు వేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరిగింది. కానీ వైట్‌హౌస్ ఖండనతో ప్రస్తుతం ఆ ప్రచారానికి చెక్ పడింది. అయినప్పటికీ ఈ అంశంపై ఎఫ్‌బీఐ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం. కాగా ఈ పరిణామాల మధ్య కాష్ పటేల్ తన పనినికొనసాగిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa