2030లో జరిగే కామన్వెల్త్ గేమ్స్కు సంబంధించి గుడ్న్యూస్ వచ్చింది. ఈ క్రీడల ఆతిథ్య హక్కులను భారత్ సొంతం చేసుకుంది. నెల కిందే ఆతిథ్య హక్కులు దాదాపు ఖాయమైనప్పటికీ.. బుధవారం గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ స్పోర్ట్ వార్షిక సర్వసభ్య సమావేశంలో 74 కామన్వెల్త్ సభ్య దేశాలు, ప్రతినిధులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
భారత్ గతంలోనూ కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది. పదిహేనేళ్ల క్రితం అంటే 2010లో ఢిల్లీ వేదికగా ఈ క్రీడా పోటీలు జరిగాయి. అయితే ఈసారి మాత్రం అహ్మదాబాద్ వేదికగా పోటీలు జరగనున్నాయి. 2036 ఒలింపిక్స్కు ఆతిథ్యమివ్వాలని భారత్ గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి తరుణంలో 2030 కామన్వెల్త్ ఆతిథ్య హక్కులు దక్కడం కీలక పరిణామం. 1930లో తొలిసారి కెనడాలోని హామిల్టన్లో కామన్వెల్త్ క్రీడలు జరిగాయి. భారత్లో జరిగే క్రీడలతో వందేళ్లు పూర్తి కానున్నాయి.
నిజానికి 2030 కామన్వెల్త్ క్రీడల కోసం భారత్తో పాటు.. నైజీరియా నగరం అబుజా పోటీ పడ్డాయి. కానీ ఎగ్జిక్యూటివ్ బోర్డు మాత్రం అహ్మదాబాద్ వైపే మొగ్గుచూపింది. “అహ్మదాబాద్లో 2030 కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న సందర్భంగా ప్రతి పౌరుడికీ శుభాకాంక్షలు. మన భారత్ను ప్రపంచ క్రీడా కేంద్రంగా మార్చాలనే ప్రధాని మోదీ దార్శనికతకు ఇది నిదర్శనం” అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. భారత్ కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య హక్కులు దక్కించుకోవడంపై కామన్వెల్త్ స్పోర్ట్ అధ్యక్షుడు డాక్టర్ డొనాల్డ్ రుకరే స్పందించారు. కామన్వెల్త్ క్రీడలకు సంబంధించిన తదుపరి శతాబ్దాన్ని గొప్పగా ప్రారంభించబోతున్నామని ఆయన పేర్కొన్నారు.
ఇక 2030 కామన్వెల్త్ గేమ్స్లో మొత్తం 15 నుంచి 17 క్రీడాంశాల్లో పోటీలు ఉండనున్నాయి. ఈ విషయాన్ని కామన్వెల్త్ స్పోర్ట్ ధ్రువీకరించింది. వీటిలో అథ్లెటిక్స్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, వెయిట్లిఫ్టింగ్, ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్, నెట్బాల్, బాక్సింగ్ సహా మరికొన్ని క్రీడలు ఇప్పటికే ఖరారయ్యాయి. మరికొన్ని పోటీలను ఎంపిక చేసే ప్రక్రియ వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది. ఆర్చరీ, బ్యాడ్మింటన్, హాకీ, జూడో, షూటింగ్, వీల్ఛైర్ బాస్కెట్బాల్, స్క్వాష్, బీచ్ వాలీబాల్, రగ్బీ సెవెన్స్, టీ20 క్రికెట్, సైక్లింగ్, డైవింగ్, వంటివి పరిశీలనలో ఉన్నాయి. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పోర్ట్స్ ఎన్క్లేవ్తో పాటు నరేంద్రమోదీ క్రికెట్ స్టేడియం ఈ క్రీడలకు ప్రధాన వేదికలుగా ఉండనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa