ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉద్యోగిని తీసేస్తే కంపెనీ ఇంకా ఎక్కువ చెల్లించాల్సిందే.. కొత్త కార్మిక చట్టాలు

business |  Suryaa Desk  | Published : Wed, Nov 26, 2025, 11:06 PM

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. అమల్లో ఉన్న 29 కార్మిక చట్టాల్ని క్రమబద్ధీకరిస్తూ.. కొత్తగా 4 కార్మిక కోడ్స్ తీసుకొచ్చింది. 2025, నవంబర్ 21నే ఇవి అమల్లోకి వచ్చాయి. దేశంలోని 50 కోట్ల మందికిపైగా కార్మికులకు ఇప్పుడు మెరుగైన వేతనాలు, సామాజిక ఉద్యోగ భద్రత, మెరుగైన వర్క్ కల్చర్ అందించడమే లక్ష్యంగా తీసుకొచ్చినట్లు తెలిపింది. ఇక్కడ వేతనాల కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్ , సామాజిక భద్రతా కోడ్, వృత్తి భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్‌లను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా కనీస వేతనం హామీ, సకాలంలో చెల్లింపులు, గిగ్ వర్కర్లకు కూడా అన్ని సామాజిక భద్రతా ప్రయోజనాలు వర్తింపజేసేలా ఉంది. ఉద్యోగులు అందరికీ కచ్చితంగా నియామక పత్రాల్ని అందించాలి. వారానికి కచ్చితంగా పని గంటలు 48 గంటల్లోపే ఉండాలి. అదనపు పనిపై రెట్టింపు వేతనం తప్పనిసరి చేసింది.


ఇక్కడ మనం కొత్త కార్మిక కోడ్స్‌లో ఉద్యోగులకు అనువుగా ఉన్నటువంటి మరో కీలక అంశం గురించి తెలుసుకుందాం. అదే లేఆఫ్స్. ఇప్పటివరకు ఉద్యోగుల్ని తొలగించినప్పుడు కొన్ని కంపెనీలు పరిహారం చెల్లిస్తుంటాయి. ఇప్పుడు ఉద్యోగుల్ని కంపెనీ తొలగిస్తే.. తొలగింపు పరిహారం సహా అదనంగా రీ స్కిల్లింగ్ ఫండ్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఫిక్స్‌డ్ టర్మ్, అలాగే శాశ్వత ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది.


>> పారిశ్రామిక సంబంధాల కోడ్- 2020 కింద ఈ నిధిని తీసుకొచ్చింది. ఇప్పుడు కొత్త కోడ్‌ల కింద ఇది భారత కార్మిక చట్టంలో కొత్త నిబంధన. SKV లా ఆఫీసెస్‌కు చెందిన సీనియర్ పార్ట్‌నర్ ప్రణవ్ భాస్కర్ దీని గురించి కీలక వివరాలు వెల్లడించారు. ఇప్పుడు కంపెనీ.. ఉద్యోగిని తీసేస్తే ఆ కార్మికుడికి 15 రోజుల వేతనానికి సమానమైన మొత్తం ఈ నిధికి జమ చేయాల్సి ఉంటుంది. కార్మికుడిని తొలగించిన 45 రోజుల్లోపు వారి బ్యాంక్ అకౌంట్లలో ఈ మొత్తం జమ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగం కోల్పోయినప్పుడు కార్మికులు కేవలం పరిహారంతో సరిపెట్టుకోకుండా.. కొత్త నైపుణ్యాల్ని నేర్చుకొని, కొత్త ఉద్యోగాల్ని వెతుక్కునేందుకు ఈ నిధి సహాయపడుతుంది.


>> ఈ రీ స్కిల్లింగ్ ఫండ్ వచ్చినంత మాత్రాన ఇది చట్టబద్ధంగా చెల్లించాల్సిన లేఆఫ్ పరిహారాన్ని తగ్గించదు. రీ స్కిల్లింగ్ ఫండ్ కింద అదనంగా చెల్లించాల్సిందే. లేఆఫ్స్ సమయంలో.. ఉద్యోగి/కార్మికుడు చేసిన ప్రతి సంవత్సరం పనికి 15 రోజుల సగటు వేతనం చొప్పున పరిహారం లెక్కిస్తారు. ఈ రీ స్కిల్లింగ్ ఫండ్ కింద అదనంగా చివరి 15 రోజుల వేతనం వస్తుంది. ఇది కార్మికులకు ఎంతో మద్దతుగా నిలుస్తుంది. తక్షణ ఆర్థిక సహాయంగా నిలుస్తుంది. కొత్త నైపుణ్యాల శిక్షణ కోసం ఉపయోగించుకోవచ్చు. యజమానులకు కూడా మరింత బాధ్యతల్ని గుర్తుచేస్తుంది. పరిహారం పొందేందుకు.. ఉద్యోగి కనీసం ఒక సంవత్సరం సర్వీస్ పూర్తి చేసి ఉండాలి. దుష్ప్రవర్తన, పేలవమైన పనితీరు కారణంగా తొలగించడం లేఆఫ్స్ కిందికి రాదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa