దేశీయ స్టాక్ మార్కెట్లు చాలా రోజుల తర్వాత ఫుల్ జోష్లో పరుగులు పెట్టాయి. వరుసగా మూడు రోజుల నష్టాలకు బ్రేకులు వేస్తూ ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు దేశీయ మార్కెట్లు ర్యాలీ చేసేందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. బాంబే స్టాక్ ఎక్స్చేంజీ సూచీ సెన్సెక్స్ 30 ఇండెక్స్ ఈరోజు ఏకంగా 1000 పాయింట్ల మేర లాభపడింది. ఇక జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 26,200 మార్క్ దాటింది. ఈ క్రమంలో సూచీలు ఆల్టైమ్ గరిష్ఠాలకు చేరువయ్యాయి. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో నమోదిత కంపెనీల విలువ ఒక్క రోజులో ఏకంగా రూ.6 లక్షల కోట్లు పెరిగింది.దీంతో సంపద విలువ రూ.475 లక్షల కోట్లకు చేరింది.
ఈరోజు ఇంట్రాడే ట్రేడింగ్ గమనిస్తే సెన్సెక్స్ ఉదయం 84,503 పాయింట్ల వద్ద స్వల్ప నష్టాలతో ప్రారంభమైంది. కాసేపటికే లాభాల్లోకి వచ్చేసింది. ఇక ఒక్కసారి కూడా వెనుదిరగలేదు. రోజంతా లాభాల్లోనే దూసుకెళ్లింది. ఇంట్రాడే గరిష్ఠ స్థాయి 85,644.19ను తాకింది. చివరకు 1022 పాయింట్లు లాభపడి 85,609 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 50 ఇండెక్స్ 320 పాయింట్లు పెరిగి 26,205 పాయింట్ల వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ చూసుకుంటే 89.25 వద్ద ఉంది. గతేడాది 2024, సెప్టెంబర్ 27వ తేదీన సెన్సెక్స్ 85,978 వద్ద, నిఫ్టీ 26,277 వద్ద ఆల్ టైమ్ గరిష్ఠాలను తాకాయి. ఈరోజు ఆ స్థాయికి కాస్త దూరంలో నిలిచాయి.
సెన్సెక్స్ 30 ఇండెక్స్లో భారతీ ఎయిర్టెల్, ఏషియన్ పేయింట్స్ మినహా మిగిలి 28 కంపెనీల షేర్లూ లాభాల్లో ముగిశాయి. బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, రిలయన్స్, సన్ ఫార్మా వంటి షేర్లు భారీగా లాభపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 62.21 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం ఔన్స్ ధర 4159 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
డిసెంబర్ నెల పాలసీ సమావేశంలో ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న అంచనాలు బలపడ్డాయి. ఈ సారి వడ్డీ రేట్ల తగ్గింపు ఉంటుందని 85 శాతం మంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వడ్డీ రేట్లు తగ్గితే భారత్ వంటి దేశాలకు పెట్టుబడులు భారీగా వస్తాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం మరోసారి వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలతో సూచీలు రాణిస్తున్నాయి.అమెరికా మార్కెట్లలో క్రితం రోజు కొనుగోళ్ల మద్దతు కనిపించింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లు సైతం లాభపడ్డాయి. ఈ ప్రభావం దేశీయంగానూ కనిపించింది. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడమూ మన సూచీలకు కలిసొచ్చిందని చెప్పవచ్చు. వచ్చే ఏడాది సరఫరా మరింత పెరిగుతుందన్న కారణంతో బ్రెంట్ క్రూడ్ ధర 60 డాలర్ల ఎగువన ట్రేడవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa