కర్ణాటక ముఖ్యమంత్రి పదవి చుట్టూ రాజకీయ ఉత్కంఠ ఇంకా తగ్గడం లేదు. సీఎం సిద్దరామయ్య స్థానంలో ఎవరు అనే చర్చ రోజురోజుకూ మరింత వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రి జి. పరమేశ్వర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కూడా ముఖ్యమంత్రి పదవికి ఆశావహుల్లో ఒకరినని ఆయన బహిరంగంగా ప్రకటించారు.
పరమేశ్వర మాటల్లో ఆశ్చర్యం కలిగించే మరో పేరు కూడా వినిపించింది – అదే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. “ఖర్గే గారు కూడా ఆ పదవికి పూర్తిగా అర్హులు, తగిన అభ్యర్థి” అని హోంమంత్రి అన్నారు. అయితే హైకమాండ్ డిప్యూటీ సీఎం డీ.కే. శివకుమార్ను ఎంచుకుంటే తనకు అభ్యంతరం లేదని, ఆ నిర్ణయాన్ని పూర్తిగా స్వాగతిస్తానని స్పష్టం చేశారు.
డీకే శివకుమార్ పార్టీ కోసం ఎంత కష్టపడ్డారో కాంగ్రెస్ అగ్రనేతలకు బాగా తెలుసని పరమేశ్వర గుర్తు చేశారు. గత ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చిన ఘనత ప్రధానంగా డీకేకే దక్కుతుందనే వాదన ఇప్పటికే బలంగా ఉంది. అందుకే ఆయనకు ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీలో ఒక వర్గం డిమాండ్ చేస్తోంది.
సిద్దరామయ్య – డీకే శివకుమార్ మధ్య జరిగిన ఏదో ఒప్పందం గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని పరమేశ్వర చెప్పడం గమనార్హం. ఈ వ్యాఖ్యలతో కర్ణాటక కాంగ్రెస్లో సీఎం రేసు మరింత రసవత్తరంగా మారింది. ఢిల్లీలోని హైకమాండ్ ఎట్టకేలకు ఎవరికి బంపర్ ఆఫర్ ఇస్తుందన్నది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రశ్నగా మిగిలింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa