రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ వ్యాధి కేసులు గణనీయంగా పెరుగుతూ ఆరోగ్య నిపుణులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ వ్యాధికి కారకుడైన ఓరియంటియా సట్సుగముషి బ్యాక్టీరియాను చిన్న మైట్ (నల్లటి పురుగు లాంటిది) మనుషులకు సంక్రమిస్తుంది. ప్రధానంగా పొలాలు, పచ్చిక బయళ్లు, పొదలు ఉన్న ప్రాంతాల్లో ఈ మైట్ ఎక్కువగా కనిపిస్తుంది. వర్షాకాలం తర్వాత ఈ పురుగుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో కేసులు కూడా త్వరగా వ్యాపిస్తున్నాయి.
మైట్ కుడిచిన చోట ముందుగా నల్లటి గడ్డ లేదా ఎర్రటి దద్దుర్లు ఏర్పడతాయి, దీన్ని ‘ఎస్కార్’ అంటారు. ఒక వారం ఆలస్యంగా అకస్మాత్తుగా జ్వరం, తీవ్ర తలనొప్పి, ఒళ్లు నొప్పులు, జలుబు, వణుకు వచ్చి రోగి నీరసంగా మారిపోతాడు. చాలా మంది దీన్ని సాధారణ వైరల్ జ్వరంగా తేలిగ్గా తీసుకుంటారు. ఫలితంగా సకాలంలో చికిత్స అందక రోగం ముదిరిపోతుంది.
ఆలస్యమైతే ప్లేట్లెట్స్ సంఖ్య ఒక్కసారిగా పడిపోవడం, ఊపిరి ఆడకపోవడం, న్యూమోనియా, మెదడు ఇన్ఫెక్షన్ (మెనింజైటిస్), వెన్నెముక ఇన్ఫెక్షన్ వంటి తీవ్ర సమస్యలు తలెత్తుతాయి. కొన్ని రోజుల్లోనే మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ దాకా వ్యాధి వేగంగా వ్యాపించి ప్రాణాంతకం కావొచ్చు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి ఈ వ్యాధి మరీ ప్రమాదకరం.
స్క్రబ్ టైఫస్కి డాక్సీసైక్లిన్, అజిత్రోమైసిన్ వంటి యాంటీబయాటిక్స్తో 24–48 గంటల్లోనే జ్వరం తగ్గి పూర్తి చికిత్స సాధ్యమవుతుంది. కాబట్టి జ్వరం వస్తే వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి వెళ్లి రక్త పరీక్షలు చేయించుకోవడం, పూర్తి ఒళ్లు దుస్తులు ధరించడం, పచ్చిక బయళ్లలో తిరిగేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ వ్యాధి నుంచి సులువుగా కాపాడుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa