అమెరికా లేదా ఐరోపా దేశాలకు వెళ్లడం అంటే లైఫ్ సెట్ అయినట్టు అనుకుంటారు చాలా మంది. కానీ విదేశాల్లోని ఉద్యోగం, జీవనశైలి వెనుక, ఎంతటి భావోద్వేగ ఒంటరితనం దాగి ఉంటుందో ఒక ఎన్ఆర్ఐ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐదేళ్లుగా స్వీడన్లో ఉంటున్న అంకుర్ త్యాగి అనే భారతీయ వ్యక్తి.. అక్కడి క్లీన్ ఎయిర్, స్మూత్ సిస్టమ్స్ను వదులుకుని, ఢిల్లీలోని కాలుష్యం ఉన్నా సరే.. ఇండియాకు తిరిగి వచ్చేస్తున్నానని ప్రకటించారు. ఆయన పోస్ట్ చేసిన కారణం లక్షల మంది ప్రవాసీయుల గుండెలను తాకింది.
"యూరప్ అంటే పరిశుభ్రమైన గాలి, చక్కని రోడ్లు, అద్భుతమైన వ్యవస్థలు ఉంటాయని అందరూ అనుకుంటారు. అది నిజమే కావచ్చు. కానీ అక్కడ జీవితాన్ని నిర్మించుకోవడం అనేది పూర్తిగా భిన్నమైన వాస్తవం" అని అంకుర్ త్యాగి ఎక్స్ (ట్విట్టర్) లో పోస్ట్ చేశారు. ఆయన చెప్పిన అతిపెద్ద సమస్య, ఆశ్చర్యకరంగా, ఆర్థికం కాదు, ఒంటరితనం! ‘మీరు ప్రతి పనినీ ఒంటరిగా చేసుకోవాలి. వంట చేయాలి, శుభ్రం చేయాలి, బిల్లులు కట్టాలి, బిడ్డను పెంచాలి.. ముఖ్యంగా ప్రతి చలికాలంలో నిన్ను చుట్టుముట్టే నిశ్శబ్దంతో పోరాడాలి’ అంటూ తన మనసులోని వేదనను బయటపెట్టారు.
విదేశాల్లో స్నేహితులు కూడా చాలా మర్యాదగా, దూరంగా ఉంటారని, ఇండియాలో ఉన్నట్లుగా బలమైన బంధాలు, సంఘీభావం అక్కడ ఉండదని త్యాగి ఆవేదన వ్యక్తం చేశారు. ‘మన దేశంలో అవినీతి, గందరగోళం ఉన్న మాట వాస్తవమే. కానీ కనీసం మన చుట్టూ మనుషులు ఉంటారు. కానీ పశ్చిమ దేశాల్లోని సమస్యలు వేరే రకంగా ఉంటాయి, వాటి బాధను అనుభవించినవారికే తెలుస్తుంది. అవి మన లోపలికి మరింత బలంగా కోసుకుపోతాయి’ అని ఆయన పేర్కొన్నారు.
అంకుర్ త్యాగి పోల్చిన పోలిక ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్లో ఉంది. ఢిల్లీలో కాలుష్యం ఎక్కువగా ఉన్నా సరే.. ఈ డిసెంబర్ 5న తాను ఇండియాకు తిరిగి వచ్చేస్తున్నానని ఆయన ధైర్యంగా చెప్పారు. "ప్రతి ప్రదేశానికి ఒక ఖర్చు ఉంటుంది. మనం దేన్ని భరించగలం అని మాత్రమే తెలుసుకోవాలి. నాకైతే ఇప్పుడు స్నేహితులు, కుటుంబ సభ్యుల రూపంలో నిజమైన ఆక్సిజన్ అవసరం" అని ఆయన ఆ పోస్ట్లో రాశారు. అంటే, విదేశాల్లోని శుభ్రమైన గాలి కంటే.. కుటుంబం, స్నేహితుల 'మద్దతు' అనే ఆక్సిజనే తనకు ముఖ్యమని పరోక్షంగా చెప్పకనే చెప్పారు.
మొత్తం మీద ఈ పోస్ట్.. వేలాది ఎన్ఆర్ఐల హృదయాన్ని తాకడమే కాక, చాలా మంది ప్రవాసీయులు తమ జీవితాల్లో ఎందుకు ఒంటరితనాన్ని ఎదుర్కొంటున్నారు అనే విషయాన్ని గ్లోబల్ డిబేట్కు దారితీసింది. ఆస్ట్రేలియా, పారిస్ వంటి ప్రాంతాల్లోని ఇతర ఎన్ఆర్ఐలు కూడా ఆయన అభిప్రాయంతో ఏకీభవిస్తూ కామెంట్లు పెట్టారు. డబ్బు, మెటీరియల్ సక్సెస్ వెంట పరుగు పెడుతున్నప్పుడు, మానసిక ప్రశాంతత ఎంత ముఖ్యమో, మాతృదేశంలో లభించే సామాజిక మద్దతు విలువ ఎంత ఉందో ఈ ఒకే ఒక్క పోస్ట్ ప్రపంచానికి స్పష్టం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa