ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాలని కలలు కంటున్న విద్యార్థులకు.. ముఖ్యంగా మన భారతీయులకు అగ్రరాజ్యం ఓ భారీ ఊరట ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. దీని కోసం F-1 స్టూడెంట్ వీసాల నిబంధనల్లో కీలక మార్పులు తీసుకురానుంది. ప్రస్తుతం అమలులో ఉన్న 'ఇంటెంట్ టు లీవ్' అనే ఒక కఠినమైన నిబంధనను రద్దు చేసే దిశగా 'డిగ్నిటీ యాక్ట్-2025' అనే కొత్త చట్టాన్ని ప్రతిపాదించారు.
‘ఇంటెంట్ టు లీవ్’ అంటే ఏంటి?: ఈ పాత రూల్ ప్రకారం, వీసా కోసం దరఖాస్తు చేసే విద్యార్థులు... "మా చదువు పూర్తయిన వెంటనే, మేము తప్పనిసరిగా అమెరికాను విడిచిపెట్టి మా స్వదేశానికి తిరిగి వచ్చేస్తాం" అని కాన్సులర్ ఆఫీసర్కు నిరూపించుకోవాలి. దీన్ని నిరూపించడానికి, మన దేశంలో ఉన్న ఆస్తులకు సంబంధించిన పత్రాలు లేదా ఉద్యోగావకాశాలకు సంబంధించిన డాక్యుమెంట్లను చూపించాల్సి ఉండేది.
నిజానికి, స్టూడెంట్ ( F-1) వీసాలు చాలా వరకు ఈ 'తిరిగి వెళ్లే ఉద్దేశం' (ఇంటెంట్ టు లీవ్) నిరూపించుకోలేక తిరస్కరణకు గురవుతున్నాయి. ఈ ఏడాది మన భారతీయ విద్యార్థులకు వీసాల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణం ఇదే. ఈ నిబంధన వల్ల, ఉన్నత చదువుల తర్వాత అక్కడే ఉద్యోగం వెతుక్కోవాలని లేదా స్థిరపడాలని చూసే విద్యార్థులకు ఇది పెద్ద అడ్డంకిగా మారింది.
తాజాగా ప్రతిపాదించిన చట్టం కనుక అమల్లోకి వస్తే.. "తిరిగెళ్లే ఉద్దేశం ఉందా?" అనే ప్రశ్న కాన్సులేట్ అధికారి అడిగే అవకాశం లేదా దాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉండదు. దీంతో అమెరికాకు వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని ట్రంప్ యంత్రాంగం భావిస్తోంది. అందుకే ఎఫ్-1 వీసా నిబంధనలను సడలించేందుకు సిద్ధమైంది. అయితే, ఈ మార్పులు అమలులోకి రావాలంటే.. ఈ ప్రతిపాదన అమెరికా కాంగ్రెస్లోని ఉభయసభల్లో ఆమోదం పొంది, చివరిగా అధ్యక్షుడు సంతకం చేయాల్సి ఉంటుంది. మరోవైపు, విద్యార్థులు ఎంతకాలం చదవాలనుకుంటే అంతకాలం ఉండే వీలు లేకుండా.. 'పరిమిత కాల నివాస అనుమతి'తో కూడిన వీసాలను మంజూరు చేయాలని కూడా హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ప్రతిపాదించడం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa