ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేపాల్ కొత్త రూ.100 నోటు మ్యాప్‌లో భారత భూభాగాలు,,,,మళ్లీ భారత్‌తో సరిహద్దు కయ్యం

international |  Suryaa Desk  | Published : Fri, Nov 28, 2025, 08:45 PM

నేపాల్ దేశపు కేంద్ర బ్యాంకు తాజాగా విడుదల చేసిన రూ.100 కొత్త కరెన్సీ నోటు.. భారత్, నేపాల్ మధ్య ఉన్న సరిహద్దు వివాదాన్ని మరోసారి తెరపైకి తీసుకువచ్చింది. ఈ కొత్త రూ.100 నోటుపై ముద్రించిన నేపాల్ నేషనల్ మ్యాప్‌లో భారత్ తన భూభాగంగా చెబుతున్న కాలాపాని, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాలను నేపాల్ తనవిగా చూపించడం గమనార్హం. గతంలో 2020లోనే ఇదే రకమైన మ్యాప్‌ను విడుదల చేసిన నేపాల్.. భారత్ నుంచి తీవ్ర విమర్శలు, వ్యతిరేకతను ఎదుర్కొంది. ఇప్పుడు మరోసారి కూడా అలాంటి పనే చేయడం భారత్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. అయితే దీనిపై నేపాల్ కేంద్ర బ్యాంకు వివరణ ఇచ్చింది.


మ్యాప్ మార్పు, భారత్ అభ్యంతరం


2020లో అప్పటి నేపాల్ ప్రభుత్వం.. ఈ వివాదాస్పద లిపులేఖ్, కాలాపాని, లింపియాధురా ప్రాంతాలను కలుపుతూ జాతీయ మ్యాప్‌ను సవరించింది. ఆ సమయంలో కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని ప్రభుత్వం రూపొందించిన ఆ మ్యాప్‌ నేపాల్ పార్లమెంట్‌లో ఆమోదం పొందింది. అయితే నేపాల్ ఇలా చేయడంపై భారత్ వెంటనే తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. అభ్యంతరం వ్యక్తం చేసింది. నేపాల్ విడుదల చేసిన మ్యాప్‌ను ఏకపక్ష నిర్ణయమని పేర్కొన్న భారత్.. సరిహద్దు వివాదాలను ఇలా కృత్రిమంగా విస్తరించుకోవడం ఆమోదయోగ్యం కాదని తీవ్ర హెచ్చరికలు చేసింది.


కొత్త నోటులో మార్పులు


నేపాల్ రాష్ట్ర బ్యాంక్ (ఎన్ఆర్‌బీ) విడుదల చేసిన ఈ కొత్త రూ.100 నోటుపై.. మాజీ గవర్నర్ మహా ప్రసాద్ అధికారి సంతకం ఉంది. అంతేకాకుండా ఈ నోటు 2081 బీఎస్ అంటే 2024లోనే జారీ అయినట్లు తెలియజేస్తోంది. ఉత్తరాఖండ్‌లోని పిథోరాగఢ్ జిల్లాలో కాలాపాని ప్రాంతం భాగమని భారత్ చెబుతూ వస్తోంది. కానీ నేపాల్‌లోని ధార్చులా జిల్లాకు చెందిందని ఆ దేశం వితండ వాదన చేస్తోంది. లిపులేఖ్ పాస్ ఫార్-వెస్ట్రన్ ప్రాంతంలో కాలాపాని ప్రాంతానికి దగ్గర్లో ఉంటుంది.


నేపాల్ కొత్త రూ.100 నోటులోని అంశాలు


ఈ కొత్త రూ.100 నోటు ముందు భాగంలో.. ఎడమ వైపున ఎవరెస్ట్ పర్వతం, కుడి వైపున ఆ దేశ జాతీయ పుష్పమైన రోడోడెండ్రాన్ వాటర్‌మార్క్.. మధ్యలో నేపాల్ మ్యాప్.. బుద్ధుడు జన్మస్థలమైన లుంబిని అనే వచనం ఉన్న అశోక స్తంభం ముద్రించారు. ఇక వెనుక భాగంలో.. ఒక కొమ్ము కలిగిన ఖడ్గమృగం చిత్రం, సెక్యూరిటీ థ్రెడ్, దృష్టి లోపం ఉన్నవారు గుర్తించడానికి ఒక ఉబ్బెత్తు నల్లటి చుక్కను ఏర్పాటు చేశారు.


నేపాల్ రాస్త్ర బ్యాంక్ వివరణ


కొత్త రూ.100 నోటులో మ్యాప్‌ను మార్చడంపై నేపాల్ కేంద్ర బ్యాంక్ ప్రతినిధి స్పందించారు. నేపాల్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా పాత రూ. 100 నోటులో ఉన్న మ్యాప్‌ను కొత్తగా అప్‌డేట్ చేసినట్లు వెల్లడించారు. నేపాల్‌లో చలామణిలో ఉన్న అన్ని కరెన్సీల్లో రూ.100 నోటుపై మాత్రమే ఆ దేశ మ్యాప్‌ను ముద్రిస్తారు. మిగతా ఏ కరెన్సీపైనా ఈ నేషనల్ మ్యాప్ ఉండదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa