ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రధాని కార్యాలయం పేరు సేవా తీర్థ్‌గా నామకరణం

national |  Suryaa Desk  | Published : Tue, Dec 02, 2025, 08:16 PM

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం.. మరో చారిత్రక నిర్ణయానికి తెరలేపింది. దేశ రాజధాని ఢిల్లీలో నిర్మిస్తున్న సెంట్రల్ విస్తా ప్రాజెక్టులో భాగంగా.. ప్రధానమంత్రి కార్యాలయాన్ని మార్చనున్నారు. అదే సమయంలో ప్రధాని కార్యాలయం పేరును మార్చుతూ కీలక నిర్ణయం తీసుకుంది. పీఎంఓను ఇకనుంచి సేవాతీర్థ్‌గా పిలవనున్నట్లు తెలిపింది. 78 ఏళ్లుగా సౌత్‌ బ్లాక్‌లోని కార్యాలయం నుంచి ప్రధానమంత్రులు విధులు నిర్వర్తిస్తుండగా.. ఆ కార్యాలయం ఇప్పుడు కొత్త భవనంలోకి మారనుంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం పేరు మార్పు ప్రకటనను వెలువరించింది. ఇక రాజ్‌భవన్‌ల పేర్లను కూడా లోక్‌భవన్లుగా మార్చింది.


సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మిస్తున్న ఎగ్జిక్యూటివ్ ఎన్‌క్లేవ్‌కు సేవా తీర్థ్ అని కేంద్రం పేరు పెట్టింది. ఈ పేరు సేవ స్ఫూర్తిని.. జాతీయ ప్రాధాన్యతలకు సంబంధించిన పని ప్రదేశాన్ని ప్రతిబింబిస్తుందని కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఇక పూర్తయ్యే దశలో ఉన్న ఈ కొత్త సముదాయంలో పీఎంఓతో పాటు కేబినెట్ సెక్రటేరియట్, జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్, అతిథులతో ఉన్నత స్థాయి చర్చలకు వేదికగా ఉండే ఇండియా హౌస్ కార్యాలయాలు కూడా ఉంటాయి.


ప్రధాని మోదీ నాయకత్వంలో.. పాలనా కేంద్రాలకు పేర్లు మార్చడం ద్వారా కర్తవ్య, పారదర్శకతను ప్రతిబింబించేలా సంస్కరణలు జరుగుతున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల గవర్నర్ల అధికారిక నివాసాలైన రాజ్ భవన్‌లను కూడా ప్రజాసేవకు అనుగుణంగా లోక్ భవన్‌లుగా మారుస్తున్నారు. అలాగే సెంట్రల్ సెక్రటేరియట్‌కు కర్తవ్య భవన్, రాజ్‌పథ్‌కు కర్తవ్య పథ్ అని పేరు మార్చడం ద్వారా అధికారం అనేది హక్కు కాదు, బాధ్యత అనే సందేశాన్ని ప్రజలకు అందిస్తున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.


ఈ పేరు మార్పులు కేవలం పరిపాలనాపరమైనవే కాకుండా.. భారతదేశ ప్రజాస్వామ్యం అధికారం నుంచి బాధ్యత వైపు.. హోదా నుంచి సేవ వైపు సాగుతున్న భావజాల మార్పును సూచిస్తున్నాయని పేర్కొంటున్నాయి. ప్రభుత్వ భవనాలు, కీలక మార్గాలకు పేరు మార్చడం ద్వారా పాలనా విధానంలో ఒక కొత్త సంస్కృతిని తీసుకురావాలని కేంద్రం చూస్తోంది. గతంలో కార్యాలయాలు విస్తరించి ఉండటం వల్ల కేంద్ర ప్రభుత్వ సమన్వయానికి ఇబ్బందులు ఉండేవి.


కానీ సెంట్రల్ విస్టా ప్రాజెక్టులోని ఈ కొత్త కాంప్లెక్స్ ఆ సమస్యను పరిష్కరిస్తుందని కేంద్రం తెలుపుతోంది. కొత్తగా నిర్మించిన ఈ కాంప్లెక్స్‌లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కీలక కార్యాలయాలు అన్నీ ఒకే దగ్గర పనిచేయడం ద్వారా అత్యున్నత స్థాయి పాలనలో సమన్వయం మెరుగుపడుతుందని చెబుతోంది. ప్రధానమంత్రి అధికారిక నివాసానికి 2016లోనే లోక్ కళ్యాణ్ మార్గ్ అని పేరు మార్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa