రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండ్రోజుల పర్యటన నిమిత్తం భారత దేశానికి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈసందర్భంగానే ప్రధాని నరేంద్ర మోదీ.. మన దేశానికి వచ్చిన పుతిన్కు అదిరిపోయే బహుమతి ఇచ్చారు. అయితే అదిప్పుడు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా లోక్కల్యాణ్ మార్గ్లో జరిగిన విందు అనంతరం.. మోదీ పుతిన్కు రష్యన్ భాషలోకి అనువదించిన భగవద్గీత ప్రతిని బహుమతిగా ఇచ్చారు. ఈ చర్యను అధికారులు, విశ్లేషకులు భారతదేశం 'సాఫ్ట్ పవర్' దౌత్యంగా పరిగణిస్తున్నారు.
ముఖ్యంగా భగవద్గీతను.. రష్యా భాషలోకి అనువదించి ఇవ్వడం అందరినీ ఆకట్టుకుంటోంది. దీనిపై పుతిన్ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని నేరుగా ప్రధాని మోదీయే ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ బహుమతి ఇచ్చేటప్పుడు తీసిన ఫొటోను కూడా షేర్ చేయగా.. నెటిజెన్లు అంతా తెగ సంబుర పడిపోతున్నారు. వావ్, గ్రేట్ సార్ అంటూ కామెంట్ల వర్షం కూడా కురిపిస్తున్నారు.
పశ్చిమ దేశాలకు వ్యతిరేకం కాదు: పుతిన్
చర్చలకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాస్కో, న్యూఢిల్లీ మధ్య సహకారం ఏ పశ్చిమ దేశ వ్యతిరేక కూటమిలో భాగం కాదని ఆయన స్పష్టం చేశారు. "తమకు ఒత్తిడి ఎదురవుతున్నప్పటికీ.. మేం, ప్రధాని మోదీ ఎప్పుడూ ఎవరికో వ్యతిరేకంగా పని చేయడానికి సహకారాన్ని పెంచుకోలేదు" అని పుతిన్ అన్నారు. ఈ భాగస్వామ్యం వైరుధ్యాలపై కాకుండా పరస్పర ప్రయోజనాలపై ఆధారపడి ఉందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా జీ7 ("బిగ్ సెవెన్") కూటమిని పుతిన్ విమర్శిస్తూ.. కొనుగోలు శక్తి సమానత్వం పరంగా భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉండగా, యూకే 10వ స్థానంలో ఉందని గుర్తు చేశారు.
ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు..
పుతిన్ పర్యటన సందర్భంగా ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్పై విస్తృతమైన ఆంక్షలు విధించారు. వీఐపీ కాన్వాయ్ భద్రత, రూట్ శానిటైజేషన్ కారణంగా సెంట్రల్ ఢిల్లీలోని డబ్ల్యూ పాయింట్, ఐటీఓ, బీఎస్ జెడ్ మార్గ్, రాజ్ఘాట్, ప్రగతి మైదాన్ టన్నెల్తో సహా పలు మార్గాల్లో వాహనాలను మళ్లించారు. ఆఫీసులకు వెళ్లేవారు మెట్రో సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. అంతేకాకుండా శిఖరాగ్ర సమావేశం కోసం డ్రోన్ నిరోధక చర్యలు, పోలీసు, పారామిలటరీ దళాల మోహరింపుతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.
ఉక్రెయిన్ దాడి తర్వాత పుతిన్ భారత్ను సందర్శించడం ఇదే మొదటిసారి. మాజీ దౌత్యవేత్త రాజీవ్ భాటియా ఈ పర్యటనను చాలా ముఖ్యమైనదిగా అభివర్ణించారు. రక్షణ, ఇంధనం, రూపాయి-రూబుల్ వాణిజ్యం, ఆంక్షలను ఎదుర్కోవడం వంటి అనేక వ్యూహాత్మక అంశాలపై చర్చలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ సాంస్కృతిక దౌత్యం ద్వారా పశ్చిమ దేశాల నుంచి దూరం జరగకుండానే భారత్, రష్యాను దగ్గరగా ఉంచుకోవాలని కోరుకుంటోందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa