విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ రాజ్యసభకు వెల్లడించారు. గత 14 సంవత్సరాలలో ఈ సంఖ్య 20 లక్షలు దాటింది. ఇటీవల సంవత్సరాలలో విదేశీ పౌరసత్వాన్ని ఎంచుకునే భారతీయుల సంఖ్య స్థిరంగా పెరుగుతోంది. మరోవైపు, విదేశాంగ శాఖ విదేశీ ఉద్యోగాల కోసం నకిలీ ఆఫర్లకు ఆకర్షితులవుతున్న భారతీయ యువత గురించి ఆందోళన వ్యక్తం చేసింది. సోషల్ మీడియా ద్వారా మోసాలు జరుగుతున్నాయని, వాటిని నివారించడానికి ప్రభుత్వం ఇ-మైగ్రేట్ పోర్టల్లో నమోదు కాని ఏజెంట్ల వివరాలను పొందుపరుస్తోందని మంత్రి తెలిపారు.
భారతీయ పౌరసత్వాన్ని వదులుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్.. గురువారం రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. భారత పౌరసత్వాన్ని వదిలేసుకున్న వారి గణాంకాలను పార్లమెంట్కు సమర్పించారు. గత 5 ఏళ్ల కాలంలో దాదాపు 9 లక్షల మంది భారతీయులు.. తమ పౌరసత్వాన్ని వదిలేసుకుని.. ఇతర దేశాల పౌరసత్వాలను తీసుకున్నట్లు కేంద్రమంత్రి కీర్తి వర్ధన్ సింగ్ వెల్లడించారు.
కేంద్రం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. 2011 నుంచి 2024 వరకు.. గత 14 సంవత్సరాల్లో 20 లక్షలకు పైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని తెలుస్తోంది. భారత పౌరసత్వాన్ని వదులుకునే వ్యక్తులకు సంబంధించి.. వార్షిక రికార్డులను కేంద్ర ప్రభుత్వం భద్రపరుస్తుందని కేంద్రమంత్రి కీర్తి వర్ధన్ సింగ్ తెలిపారు. 2011-2019 మధ్య కాలంలో 11,89,194 మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారని పేర్కొన్నారు.
ఇటీవలి సంవత్సరాల్లో వేరే దేశాలకు చెందిన పౌరసత్వాలను తీసుకుంటున్న భారతీయుల సంఖ్య నిలకడగా పెరుగుతూ వస్తోందని కేంద్రమంత్రి తెలిపారు. ఏటా ఈ పౌరసత్వాలు వదిలేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు ఈ గణాంకాల్లో స్పష్టంగా తెలుస్తోంది. ఉదాహరణకు.. 2024లో 2,06,378 మంది.. 2022లో 2,25,620 మంది పౌరసత్వాన్ని వదులుకున్నారు.
ఇదిలా ఉండగా.. విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకునే భారతీయ యువత నకిలీ గల్ఫ్ ఉద్యోగ ఆఫర్ల బారిన పడుతూ అక్రమ రవాణా నెట్వర్క్ల ద్వారా మోసపోతున్నారని విదేశాంగ శాఖ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఈ సందర్భంగా పార్లమెంటుకు తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే జాబ్ ఆఫర్లను నమ్మి చాలా మంది మోసాలకు గురి అవుతున్నారని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ఇలాంటి మోసాలను నివారించడానికి.. కేంద్ర విదేశాంగ శాఖ సోషల్ మీడియా ద్వారా దేశ ప్రజలకు అవగాహన కార్యక్రమాలు కల్పిస్తోందని తెలిపారు. అదే సమయంలో రిజిస్టర్ కాని ఏజెంట్లపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ వెల్లడించారు. 2025 అక్టోబర్ నాటికి 3,505 నమోదు కాని ఏజెంట్ల వివరాలను.. ఈ-మైగ్రేట్ పోర్టల్లో పొందుపరిచినట్లు స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa