ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉపాధి హామీ పథకం పేరు మార్చిన మోదీ సర్కార్

national |  Suryaa Desk  | Published : Fri, Dec 12, 2025, 08:18 PM

కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ మరో సంచలన నిర్ణయానికి తెరలేపింది. ఉపాధి హామీ పథకం పేరును మార్చేసింది. ఇప్పటివరకు మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా ఉన్న పేరును పూజ్య బాపు గ్రామీణ రోజ్‌గార్ యోజనగా మార్చుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పేరు మార్పుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అంతేకాకుండా ఉపాధి హామీ పథకంలో భాగంగా ఇప్పటివరకు ఉన్న పనిదినాలను 100 నుంచి 125 రోజులకు పెంచింది. ఇక ఉపాధి హామీ కూలీల వేతనాలను కూడా పెంచింది. ఇక పథకానికి రూ.1.51 లక్షల కోట్లను కేటాయిస్తూ.. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.


దేశవ్యాప్తంగా పల్లెల్లో ఉండే పేదలకు ఉపాధి కల్పించే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును పూజ్య బాపు గ్రామీణ రోజ్‌గార్ యోజనగా మార్చే నిర్ణయానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అంతేకాకుండా ఇప్పటివరకు ఈ పథకంలో 100 రోజుల పని దినాలు ఉండగా.. వాటిని సంవత్సరానికి 125 రోజులకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పూజ్య బాపు గ్రామీణ రోజ్‌గార్ గ్యారంటీ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక ఒక రోజుకు కూలీలకు ఇచ్చే కనీస వేతనాన్ని రూ.240కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.


ఇక ఈ పూజ్య గ్రామీణ రోజ్‌గార్ యోజన కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 1.51 లక్షల కోట్లు కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుంది. వాస్తవానికి ఈ పథకం 2005లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ-1 ప్రభుత్వం.. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరుతో ప్రారంభించారు. ఆ తర్వాత దానికి మహాత్మా గాంధీ పేరును జోడించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు జీవనోపాధి భద్రతను పెంచడమే ప్రధాన లక్ష్యంగా ఈ ఉపాధి హామీ పథకాన్ని అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద గ్రామాల్లో నైపుణ్యం లేని శ్రమ చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చే ప్రతీ కుటుంబానికి ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజుల వేతన ఉపాధికి హామీ ఇవ్వబడుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa