ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రియాంక కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాలి.. సోనియాకు మాజీ ఎమ్మెల్యే సంచలన లేఖ

national |  Suryaa Desk  | Published : Fri, Dec 12, 2025, 08:20 PM

ప్రియాంక గాంధీ వాద్రాకు కాంగ్రెస్ పార్టీ పగ్గాలను అప్పగించాలని కోరుతూ అగ్రనేత సోనియా గాంధీకి మాజీ ఎమ్మెల్యే సంచలన లేఖ రాశారు. రాహుల్ గాంధీ , ప్రియాంక వర్గాల మధ్య ఆధిపత్య పోరు జరుగుతోందని బీజేపీ ఆరోపణల నేపథ్యంలో ఈ లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది. వయసు పైబడటంతో మల్లికార్జున ఖర్గేను బాధ్యతల నుంచి తప్పించాలని ఒడిశాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత మహమ్మద్ మోక్విమ్ కోరారు. యువతకు కాంగ్రెస్ పార్టీ చేరువకావాలంటే యువనాయకత్వాన్ని ప్రోత్సహించాల్సిన సమయం వచ్చిందని బారాబతి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆరు పేజీల సుదీర్ఘ లేఖను రాయడం గమనార్హం. మోక్వీమ్ కుమార్తె ప్రస్తుతం బరాబతి ఎమ్మెల్యేగా ఉన్నారు.


ఏఎన్ఐ వార్తా సంస్థతో మోక్విమ్ మాట్లాడుతూ.. ‘‘పార్టీ క్లిష్ట దశలో ఉంది.. కాంగ్రెస్‌కు కొత్త నాయకత్వం అవసరం.. మల్లికార్జున ఖర్గేకు వయసు ప్రధాన ఆటంకం.. అందుకే మనం యువ నాయకులకు ముందుకు తీసుకురావాలి.. సోనియా గాంధీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు దీనిపై కచ్చితంగా చర్చిస్తారనే నమ్మకం ఉంది’’ అని అభిప్రాయపడ్డారు. ఒడిశాలోని బారాబతి-కటక్ నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి దాదాపు 35 ఏళ్ల తిరిగి ఆ స్థానం కైవసం చేసుకుందని ఆయన తెలిపారు. గతేడాది ఎన్నికల్లో తన కుమార్తె సోఫియా ఫిర్దౌస్ విజయం సాధించారని చెప్పుకొచ్చారు. బీజేపీ, బీజేడీలను తట్టుకుని ఆమె చారిత్రాత్మక విజయం సాధించారని పేర్కొన్నారు. ప్రధాని మంత్రి, హోమ్ మంత్రి, అప్పటి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌లు ప్రచారం చేసినా.. వాటిని తిప్పికొట్టి ప్రజల మనసులు గెలిచారని వ్యాఖ్యానించారు.


‘‘శతాబ్దపు వారసత్వం ఇతరుల ఓడించడం ద్వారా కాదు.. మనం తీసుకున్న నిర్ణయాల ద్వారా చేజారిపోయింది.. మనం ఇప్పుడు మేల్కొనకపోతే వారసత్వంగా పొందిన కాంగ్రెస్‌ను కోల్పోయే ప్రమాదం ఉంది’’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీపై కూడా ఆయన పరోక్షంగా విమర్శలు చేశారు. గత మూడేళ్లుగా రాహుల్‌ను కలవడానికి తాను చాలా ప్రయత్నించానని, కానీ అపాయింట్‌మెంట్ దొరకలేదని లేఖలో పేర్కొన్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి బాధ్యతవహిస్తూ రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దాదాపు మూడేళ్ల అనంతరం 2022లో మల్లికార్జున ఖర్గే జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2019లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి 2024 వాయనాడ్ ఉప-ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa