ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకోడానికి భారత్, చైనాల చేస్తోన్న ప్రయత్నాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. చైనా నిపుణులకు సాధ్యమైనంత వేగంగా వాణిజ్య వీసా జారీ కోసం కేంద్ర ప్రభుత్వం నిబంధనల్లో మార్పులు చేసినట్లు సమాచారం. ఇరుదేశాల ద్వైపాక్షిక బంధం బలోపేతానికి ఇది దోహదం చేయనుంది. సంబంధిత అధికారులను ఉటంకిస్తూ ఈ మేరకు జాతీయ మీడియా కథనాలను ప్రచురించింది. నిబంధనల్లో మార్పులు చేయడం వల్ల వీసా ప్రక్రియలో జాప్యాలను నివారించవచ్చని, దాంతో వ్యాపారాలకు వృత్తి నిపుణుల కొరత లేకుండా చూసుకోవచ్చని తెలిపాయి. వీసా ఆమోద సమయాన్ని నాలుగు వారాల్లోపునకు తగ్గించడం సహా కొన్ని నిబంధనలను తొలగించారని అధికారులు పేర్కొన్నారు.
ఆంక్షలను ఉల్లంఘించి రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నామనే వంకతో భారత్పై అమెరికా అదనపు సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చైనా వేదికగా జరిగిన షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. అక్కడ చైనా అధినేత షీ జిన్పింగ్తోనూ ప్రధాని మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రపంచ శాంతి, శ్రేయస్సు కోసం భారత్, చైనాలు కలిసి పనిచేయాలని ఆ సందర్భంగా ఇరువురు నేతలూ పిలుపునిచ్చారు. అంతేకాదు, సరిహద్దు వివాదాలను పరిష్కరించుకుని అన్ని రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా చైనా నిపుణులకు వీసా జారీ నిబంధనలను సడలిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గల్వాన్ లోయ ఘర్షణల తర్వాత చైనా పౌరులకు వీసాలపై కేంద్రం కఠిన ఆంక్షలు విధించింది. వ్యాపార వీసాల పరిశీలనను తీవ్రతరం చేసింది. ప్రస్తుత వాటిని సడలించడంతో వీసా పొందడంలో ఎదురయ్యే ఇబ్బందులు తప్పాయని సదరు అధికారులు పేర్కొన్నారు. ‘‘మేము దరఖాస్తుల స్క్రూట్నీ ప్రక్రియలో నిబంధనలు సడలించాం.. నాలుగు వారాల్లోపు బిజిజెన్ వీసాలను ప్రాసెస్ చేస్తున్నాం’ అని అధికారి తెలిపారు.
ఈ అంశంపై విదేశాంగ, హోమ్, వాణిజ్య మంత్రిత్వ శాఖలు, అలాగే ప్రధానమంత్రి కార్యాలయాన్ని సంప్రదించగా ఇంతవరకు స్పందించలేదని రాయిటర్స్ పేర్కొంది. అబ్జర్వర్ రిసెర్చ్ ఫౌండేషన్ అంచనా ప్రకారం.. కఠినమైన పరిశీలన కారణంగా నాలుగేళ్లలో మొబైల్ తయారీకి చైనా నుంచి కీలక యంత్రాలను దిగుమతి చేసుకునే భారతీయ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమదారులకు 15 బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లింది. షొవోమి వంటి చైనా కంపెనీలు వీసాలు పొందడానికి ఇబ్బంది పడ్డాయని రాయిటర్స్ గతేడాది నివేదించింది. ప్రతీకార సుంకాలతో డొనాల్డ్ ట్రంప్ మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధం ఒక విధంగా భారత్, చైనాలను దగ్గర చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa