ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎలాన్ మస్క్‌కు ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య లేఖ

international |  Suryaa Desk  | Published : Sat, Dec 13, 2025, 08:48 PM

ప్రపంచ కుబేరుడు, ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ దృష్టికి పాకిస్థాన్ రాజకీయాలు, మానవ హక్కుల అంశాన్ని తీసుకువస్తూ ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య జెమీమా గోల్డ్‌స్మిత్ బహిరంగ లేఖ రాశారు. జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి గురించి తాను పెడుతున్న పోస్టులు ప్రజలకు చేరడం లేదని.. దీనికి కారణమైన తన ఎక్స్ ఖాతాపై ఉన్న 'విజిబిలిటీ ఫిల్టరింగ్‌'ను సరిచేయాలని ఆమె మస్క్‌ను విజ్ఞప్తి చేశారు.


బిడ్డల ఆవేదన ప్రపంచానికి చేరడం లేదు


ప్రస్తుతం జైలులో ఏకాంత నిర్బంధంలో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌ను కలుసుకునేందుకు లేదా మాట్లాడేందుకు కూడా తన ఇద్దరు కుమారులకుపాక్ అధికారులు అనుమతి ఇవ్వడం లేదని జెమీమా ఈ పోస్టులో వెల్లడించారు. ఈ మేరకు ఆమె తన ఎక్స్ ఖాతాలో మస్క్‌ను ట్యాగ్ చేస్తూ ఒక వ్యక్తిగత విజ్ఞప్తి చేశారు. ఆ పోస్టులో జెమీమా మాట్లాడుతూ.. "ఎలాన్ మస్క్‌కు ఓ వ్యక్తిగత విజ్ఞప్తి. చట్టవిరుద్ధంగా ఏకాంత నిర్బంధంలో ఉన్న తమ తండ్రిని చూసేందుకు, మాట్లాడేందుకు నా ఇద్దరు కుమారులకు అనుమతి లేదు. కేవలం 'ఎక్స్' ద్వారా మాత్రమే ఇమ్రాన్ ఖాన్ గురించి, తమ ఆవేదనను ప్రపంచానికి చెప్పగలం" అని భావోద్వేగంగా రాసుకొచ్చారు.


బ్లాక్ అవుతున్న పోస్టులు?


పాక్ అధికారులు ఇమ్రాన్ ఖాన్‌పై వ్యవహరిస్తున్న తీరు గురించి తాను పెడుతున్న పోస్టులు బయటకు రావడం లేదని జెమీమా ఆరోపించారు. ఈ సమాచారం సాధారణ ప్రజలకు, తన ఫాలోవర్లకు చేరడం లేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇమ్రాన్ ఖాన్ తరఫున మాట్లాడేందుకు తమ కుమారులకు ఉన్న ఏకైక వేదిక ఈ సోషల్ మీడియానే అని.. కానీ ఇక్కడ కూడా తమ వాయిస్‌ను అణచి వేస్తున్నారని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే జెమీమా.. "దయచేసి నా ఎక్స్ ఖాతాలో ఉన్న విజిబిలిటీ ఫిల్టరింగ్‌ను సరిచేయండి" అని మస్క్‌కు విజ్ఞప్తి చేశారు. రాజకీయంగా అత్యంత సున్నితమైన అంశంపై.. ప్రపంచ కుబేరుడికి మాజీ ప్రధాని భార్య బహిరంగంగా ఫిర్యాదు చేయడంతో ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది.


మరోవైపు జైల్లో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలులో మృతి చెందారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆయన సోదరీమణులు దీంతో జైలుకు వెళ్లి మరీ నిరనస చేపట్టారు. ఆపై పోలీసులు తమను కొట్టారంటూ ఆరోపణలు చేశారు. దీంతో చేసేదేమీ లేక అదియాలా జైలు అధికారులు దీనిపై స్పందించాల్సి వచ్చింది. ఇమ్రాన్ ఖాన్ పూర్తిగా సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నారని జైలు అధికారులు ధృవీకరించారు. ఆ తర్వాత ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులు ఆయన్ను కలవడం.. జైల్లో ఆయన ఒంటరిగా నిర్బంధించి ఉన్నారని చెప్పడం కూడా చర్చనీయాంశంగా మారాయి. ఈక్రమంలోనే ఆయన మాజీ భార్య జెమీమా గోల్డ్‌స్మిత్.. తన కుమారులు కూడా ఆయన్ను కలిసేలా చూడాలని కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa