పాకిస్తాన్ విభజన అనగానే ముందుగా.. సుమారు 50 ఏళ్ల నాటి సంఘటనలు కళ్ల ముందు కనిపిస్తాయి. 1971లో ఇప్పుడున్న బంగ్లాదేశ్.. పాకిస్తాన్ నుంచి విడిపోయింది. ఆ తర్వాత అవి రెండు స్వతంత్ర దేశాలుగా కొనసాగుతూ వస్తున్నాయి. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత పాకిస్తాన్లో విభజన అంశం తెర మీదకు వచ్చింది. ఒకటి, రెండు కాదు.. ఏకంగా 12 భాగాలుగా పాకిస్తాన్ను విభజించే యోచనలో ఉన్నారు ఆ దేశ పాలకులు. ఇది అంతర్గత విభజన. తాజాగా పాక్ జాతీయ సమాచార శాఖ మంత్రి అబ్దుల్ అలీమ్ ఖాన్ విభజన గురించి ప్రకటన చేయడంతో.. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పాలనా సౌలభ్యం, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే పాకిస్తాన్ను 12 చిన్న ప్రావిన్సులుగా విభజించాలని నిర్ణయించామని చెప్పారని జియో టీవీ వెల్లడించింది.
పాకిస్తాన్లో ప్రస్తుతం ఉన్న నాలుగు ప్రావిన్స్లు – పంజాబ్, సింధ్, ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్లను.. ఒక్కో దాని నుంచి మరో మూడు భాగాలుగా విభజించి.. 12 చిన్న ప్రావిన్సులుగా చేయడానికి రంగం సిద్ధమైందని స్థానిక మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. దీని గురించి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ల మధ్య ఇప్పటికే చివరి దశ చర్చలు ముగిశాయని.. మరి కొద్ది రోజుల్లోనే ఈ విభజన ప్రక్రియ మొదలవుతుందని వార్తలు వస్తున్నాయి.
స్వాతంత్య్రం నాటికి అంటే 1947 కాలంలో పాకిస్తాన్లో ఐదు ప్రావిన్సులు ఉన్నాయి. అవి బలుచిస్తాన్, తూర్పు బెంగాల్, సింధ్, పశ్చిమ పంజాబ్, వాయువ్య సరిహద్దు ప్రావిన్స్. అయితే 1971 విముక్తి యుద్ధం తర్వాత.. తూర్పు బెంగాల్ ప్రావిన్స్ ప్రాంతం స్వాతంత్ర్యం ప్రకటించుకుని బంగ్లాదేశ్గా ప్రత్యేక దేశంగా ఏర్పడింది. అనంతరం పశ్చిమ పంజాబ్.. పంజాబ్ అయింది. వాయువ్య సరిహద్దు ప్రావిన్స్ పేరును ఖైబర్ పఖ్తుంఖ్వాగా మార్చారు. బలుచిస్తాన్, సింధ్ ప్రాంతాల పేర్లు మాత్రం అలాగే ఉన్నాయి.
మెరుగైన సేవలు, పరిపాలనా సౌలభ్యం కోసమే చిన్న ప్రావిన్సుల ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు పాక్ పాలకులు చెబుతున్నా.. దేశంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత కొంత కాలంగా ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ ప్రాంతాల్లో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ రెండు ప్రాంతాల ప్రజలు తమను స్వతంత్ర దేశాలుగా ప్రకటించాలని గత కొంత కాలంగా ఆందోళనలు చేస్తున్నారు. అలానే పాక్ ప్రధాని, అసిమ్ మునీర్ల పాలన మీద ప్రజల్లో వ్యతిరేకత రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో విభజన చర్య తెర మీదకు వచ్చింది. ఈ అంశంపై పాకిస్తాన్లో గత కొంత కాలంగా సెమినార్లు, చర్చలు జోరుగా సాగుతున్నాయి. విపక్షాలు మాత్రం ప్రభుత్వ ఆలోచనను వ్యతిరేకిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa