ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అల్లూరి జిల్లా రంపచోడవరం యూత్ సెంటర్లో ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభించిన నారా భువనేశ్వరి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 21, 2025, 09:06 PM

సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అన్న ఎన్టీఆర్ స్పూర్తితో 29 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో పేద ప్రజలకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి తెలిపారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జీఎస్ఎల్ అండ్ జీఎస్ఆర్ హాస్పిటల్స్ సహకారంతో అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం యూత్ సెంటర్లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆదివారం ఆమె ప్రారంభించారు. ముందుగా సీతపల్లిలో శ్రీగడి బాపనమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి రంపచోడవరం చేరుకున్న భువనేశ్వరికి కొమ్ము నృత్యంతో ఆదివాసీలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఉచిత వైద్య శిబిరాన్ని స్థానిక ఎమ్మెల్యే శిరీషా దేవితో కలిసి ప్రారంభించారు. వైద్య పరీక్షల కోసం వచ్చిన వారి వద్దకెళ్లి అందరినీ ఆప్యాయంగా పలకరించారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. వేదికపై ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆపన్నులకు చేయూత అందిస్తున్నామని నారా భువనేశ్వరి అన్నారు. "అన్న ఎన్టీఆర్ స్పూర్తితో చంద్రబాబు ట్రస్ట్ ప్రారంభించారు. ప్రజలకు సేవా కార్యక్రమాలు అందించాలని ట్రస్టును ఏర్పాటు చేశారు. చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా నేను కూడా ట్రస్టీగా ప్రజలకు అవసరమైన సేవలను అందిస్తున్నాను. గిరిజన ప్రాంతాల్లోని ప్రజల ఆరోగ్య సమస్యలు పరిష్కరించేందుకు రంపచోడవరంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశాం. ఈ మహత్తర కార్యక్రమంలో అనేక మంది డాక్టర్లు ముందుకొచ్చి తమవంతు సహకారం అందిస్తున్నారు" అని భువనేశ్వరి అన్నారు. ట్రస్ట్ ఏర్పాటు చేశాక రెండు తెలుగు రాష్ట్రాల్లో 16,365 హెల్త్ క్యాంపులు నిర్వహించి 22.64 లక్షల మంది వైద్య సేవలు అందించామని భువనేశ్వరి అన్నారు. వైద్య పరీక్షల అనంతరం రూ.22.97 కోట్ల విలువైన మందులను బాధితులకు పంపిణీ చేశామన్నారు. "మారుమూల ప్రాంతాల్లో కూడా సేవలు అందించాలని 2,083 మొబైల్ క్యాంపులు ద్వారా వైద్య సేవలు అందించాం. అలాగే ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా అనాథ పిల్లలను కూడా చదివిస్తున్నాం. పేదపిల్లలకు రూ.3.5 కోట్లు స్కాలర్ షిప్‌లతో పాటు మరో 4,297 మంది కాలేజీ విద్యార్థులకు రూ.2.70 కోట్లు ఆర్థిక సాయం అందించాం. వైజాగ్, హైదరాబాద్, తిరుపతి, రాజమండ్రిలో 4 బ్లడ్ బ్యాంకులు ద్వారా 5 లక్షల యూనిట్లు సేకరించి 9.18 లక్షల మందికి రక్తం అందించాము. దాతలు మాపై ఉంచిన నమ్మకమే మా బలం" అని భువనేశ్వరితెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa