టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో చివరగా 2010లో కనిపించాడు. ఇన్నాళ్లకు మళ్లీ ప్రతిష్టాత్మక డొమెస్టిక్ టోర్నమెంట్లో కోహ్లి ఆడుతుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. కోహ్లి ఆట చూసేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు. డిసెంబరు 24 నుంచి ప్రారంభం కానున్న 2025-26 విజయ్ హజారే ట్రోఫీలో.. షెడ్యూల్ ప్రకారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆంధ్ర, ఢిల్లీ తొలి మ్యాచ్ ఆడనున్నాయి. ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న కోహ్లి ఇప్పటికే బెంగళూరుకు వచ్చాడు. ఈ నేపథ్యంలో కోహ్లి ఆటను అభిమానులు నేరుగా చూడకపోవచ్చనే వార్తలు వస్తున్నాయి.
విజయ్ హజారే ట్రోఫీ ఫస్ట్ మ్యాచ్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించాలని కర్ణాటక క్రికెట్ అసోషియేషన్ భావించింది. అందులో భాగంగా రెండు స్టాండ్లు తెరిచి 2,000 నుంచి 3,000 మంది అభిమానులను లోపలికి అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అయితే ఈ ప్రతిపాదనను కర్ణాటక ప్రభుత్వం తిరస్కరించింది. క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని, పలు భద్రతా కారణాలు పేర్కొంటూ అనుమతి నిరాకరించింది.
కాగా, ప్లేక్షకులను అనుమతించాలని కెసీఏ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసింది. దీంతో సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి.. గ్రేటర్ బెంగళూరు అథారిటీ (జీబీఏ) కమిషనర్ నేతృత్వంలో ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. బెంగళూరు పోలీసు కమిషనర్, అగ్నిమాపక, అత్యవసర శాఖలు, ఆరోగ్య విభాగాల సభ్యులతో కూడిన ఈ కమిటీ.. చిన్నస్వామి స్టేడియాన్ని పరిశీలించి నివేదికను ప్రభుత్వానికి అందించనుంది. దాని ఆధారంగా ప్రేక్షకులను అనుమతించాలా వద్దా అనే విషయంపై కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అయితే ప్రభుత్వం స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించే అవకాశం లేదనే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అనుమతి రాకపోతే.. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ను బ్యాకప్ వేదికగా పెట్టినట్లు.. అక్కడే ప్రేక్షుకులు లేకుండానే మ్యాచ్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
దాదాపు 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆర్సీబీ విన్నింగ్ సెలెబ్రేషన్స్ను చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించిన సమయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలన సృష్టించింది. అప్పటినుంచి ఈ స్టేడియంలో ఎలాంటి మ్యాచ్లు నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో అలాంటి ఘటన మళ్లీ జరగకుండా కర్ణాటక ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది. కాగా ఢిల్లీ జట్టుకు కోహ్లి, పంత్, ఇషాంత్ శర్మ, నవ్దీప్ సైనీ వంటి స్టార్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa