ఈ రోజుల్లో చాలా మంది గ్యాస్ ట్రబుల్ సమస్యతో బాధపడుతున్నారు. పిల్లలు, పెద్దలు తేడాలేకుండా ప్రతి ఒక్కరు ఈ ప్రాబ్లమ్ ఎదుర్కొంటున్నారు. గ్యాస్ ట్రబుల్, ఉబ్బరం, ఎసిడిటీ సమస్యలు పెద్దగా అనిపించకపోవచ్చు. కానీ, వాటిని అనుభవించేవారికి ఆ ఇబ్బంది తెలుస్తుంది. ఇక, చాలా మంది తిన్న వెంటనే గ్యాస్, ఉబ్బరం వస్తున్నాయని కంప్లైంట్ చేస్తుంటారు.
దీనికి ప్రత్యేక కారణం అంటూ ఏం లేదు. తిన్న వెంటనే ఫోన్లు, సోషల్ మీడియాతో గడిపేయడం, లేదంటే నిద్రపోవడం చేస్తుంటారు. ఇక్కడే చాలా జీర్ణ సమస్యలు ప్రారంభమవుతాయి. చాలా మంది భోజనం చేసిన వెంటనే వాకింగ్ చేయడానికి ఆసక్తి చూపరు. దీంతో ఇలాంటి సమస్యలు వస్తున్నాయి.
ఇక, కడుపులో గ్యాస్ ట్రబుల్ అనిపించగానే చాలా మంది ఏవేవో పద్ధతులు ట్రై చేస్తుంటారు. కొందరు సోడా, కూల్ డ్రింక్స్ వంటివి తాగుతుంటారు. మరికొందరు ఈనో వంటివి వాడుతుంటారు. అది అప్పటివరకే రిలీఫ్ ఇస్తుంది. అయితే, నెక్స్ట్ డే మళ్లీ మామూలే. అదే గ్యాస్ ట్రబుల్. ఈ సమస్యను సహజంగా వదిలించుకునేందుకు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ లిమా మహాజన్ ఓ టెక్నిక్ చెప్పారు. రోజూ ఐదు నిమిషాలు కేటాయిస్తే చాలు గ్యాస్ ట్రబుల్, ఉబ్బరం వంటి సమస్యలు ఉండనే ఉండవు. ఆ పూర్తి వివరాలపై ఓ లుక్కేద్దాం.
లిమా మహాజన్ చెప్పిన టెక్నిక్ ఏంటి?
లిమా మహాజన్ రాత్రి భోజనం తర్వాత ఐదు నిమిషాలు కేటాయించమని సలహా ఇచ్చారు. రాత్రి భోజనం తర్వాత కేవలం ఐదు నిమిషాలు వజ్రాసనం చేయడం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుందని లిమా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వీడియో రూపంలో షేర్ చేశారు. యోగాలో వజ్రాసనానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వజ్రాసనం వేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. మరి, గ్యాస్ ట్రబుల్కి చెక్ పెట్టేందుకు వజ్రాసనం ఎలా వేయాలి, అది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
భోజనం చేసిన తర్వాత 5 నిమిషాలు వజ్రాసనం చేస్తే ఏమవుతుంది
రాత్రి భోజనం తర్వాత కేవలం ఐదు నిమిషాలు వజ్రాసన సాధన చేయడం వల్ల మొదటి రోజు నుంచి గ్యాస్, అసిడిటీ, ఉబ్బరం తగ్గుతాయని న్యూట్రిషనిస్ట్ లిమా మహాజన్ అంటున్నారు.
ఇది ఆహారాన్ని బాగా జీర్ణం చేయడానికి, పేగు కదలికలను క్రమబద్ధీకరించడానికి సాయపడుతుందని ఆమె వివరించారు. మీరు ఏం తిన్నా జీర్ణమయ్యేలా చేయడానికి ఈ ఆసనం సాయపడుతుందని లిమా చెప్పారు. ఈ ఆసనం పోషకాల శోషణను కూడా పెంచుతుందని ఆమె తెలిపారు.
ఈ ఆసనం ఎలా పనిచేస్తుంది?
వజ్రాసనాన్ని చేసేటప్పుడు, ఉదర ప్రాంతం అంటే పొట్ట ప్రాంతంపై తేలికపాటి ఒత్తిడి వర్తిస్తుందని పోషకాహార నిపుణులు వివరిస్తున్నారు. ఇది కడుపు, పేగులు, క్లోమంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఈ ఆసనం వేసినప్పుడు మీ శరీరం నిటారుగా ఉంటుంది. ఇది యాసిడ్ రిఫ్లెక్స్ సమస్యను నివారిస్తుంది.
అంతేకాకుండా అసిడిటీ సమస్యకు చెక్ పెడుతుంది. దీంతో కడుపులో చిక్కుకున్న వాయువును విడుదల చేయడంలో సాయపడుతుంది. దీంతో, ఉబ్బరం సమస్యను నివారిస్తుంది. భోజనం తర్వాత వజ్రాసన చేయడం వల్ల మీ శరీరం విశ్రాంతి మోడ్లోకి వస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తిన్న తర్వాత మీకు కడుపులో భారంగా అనిపించదు.
వజ్రాసనం కరెక్ట్గా ఎలా చేయాలి?
వజ్రాసనం చేయడం చాలా సులభం. ఈ ఆసనం చేయడానికి ముందుగా మీ మడమల మీద కూర్చోండి. మీ వెన్నెముకను నిటారుగా, పూర్తిగా రిలాక్స్గా ఉంచండి. సాధారణంగా శ్వాస తీసుకోండి. ఈ ఆసనాన్ని ఐదు నిమిషాలు మాత్రమే సాధన చేయండి. ఈ ఆసనంలో ఎటువంటి పనులపై దృష్టి కేంద్రీకరించకండి. అంటే ఫోన్ వాడటం లాంటి పనులు చేయకండి. అంతేకాకుండా మీ వీపు నిటారుగా ఉంచాలి. కొద్దిగా కూడా వంగకూడదని గుర్తించుకోండి.
ఈ ఆసనానికి ఎవరు దూరంగా ఉండాలి?
పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వజ్రాసనాన్ని మోకాలి నొప్పితో బాధపడేవారు చేయకపోవడమే మంచిది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో మోకాలి ఆపరేషన్ చేయించుకున్నవారు కూడా దీనికి దూరంగా ఉండాలి.
మిగతా వారందరూ దీనిని ట్రై చేయవచ్చు. ఒక్క విషయాన్ని గుర్తించుకోండి. ఇది మీ జీర్ణక్రియకు మద్ధతు ఇచ్చే రోజు వారీ అలవాటు మాత్రమే. దీన్ని క్రమం తప్పకుండా సాధాన చేస్తేనే మంచి ఫలితాలు ఉంటాయి. ఏదో ఒక రోజు చేస్తే అంత ప్రయోజనం ఉండదని నిపుణులు అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa