పశ్చిమాసియాలో యుద్ధం మొదలై రెండు వారాలు గడుస్తున్న తరుణంలో అంతర్జాతీయ రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. నిన్నటి వరకు రష్యా నుంచి చమురు కొనవద్దంటూ భారత్ వంటి దేశాలపై ఒత్తిడి తెచ్చిన అమెరికా.. ఇప్పుడు అదే రష్యా చమురును కొనుగోలు చేయాలంటూ లోకాన్ని బతిమాలుతోందని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘీ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఎక్స్ వేదికగా అమెరికా ద్వంద్వ నీతిని ఎండగట్టారు.
అమెరికా తీరుపై అరాఘీ ఎద్దేవా..
"గత కొన్ని నెలలుగా రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపి వేయాలంటూ భారత్ను అమెరికా బెదిరించింది. కానీ.. ఇరాన్తో యుద్ధం మొదలైన రెండు వారాలకే సీన్ మారిపోయింది. ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు పెరగకుండా ఉండేందుకు ఇప్పుడు భారత్ సహా అన్ని దేశాలను రష్యా చమురు కొనమని వైట్ హౌస్ బతిమాలుతోంది" అని అరాఘీ పేర్కొన్నారు. అమెరికా వ్యూహాలు ఎంత దారుణంగా ఉన్నాయో దీన్నిబట్టి అర్థమవుతోందని ఆయన విమర్శించారు. అంతేకాకుండా ఐరోపా దేశాల తీరును కూడా ఆయన తప్పుబట్టారు. ఇరాన్పై జరుగుతున్న అక్రమ యుద్ధానికి మద్దతు ఇస్తే.. రష్యాకు వ్యతిరేకంగా అమెరికా తమకు అండగా ఉంటుందని యూరప్ భ్రమపడుతోందని, ఇది చాలా జాలిగొలిపే విషయమని ఆయన వ్యాఖ్యానించారు.
భారత నౌకలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్..
యుద్ధం సాగుతున్నా భారత్తో ఉన్న ప్రత్యేక సంబంధాల దృష్ట్యా ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ఇంధన వాణిజ్యానికి అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి గుండా భారత నౌకల రాకపోకలకు టెహ్రాన్ అనుమతించింది. ఇప్పటికే భారత్కు చెందిన రెండు ఎల్పీజీ క్యారియర్ నౌకలు ఈ జలసంధి గుండా సురక్షితంగా ప్రయాణించాయి. అలాగే సౌదీ అరేబియా నుంచి చమురుతో వస్తున్న మరో ట్యాంకర్ కూడా శనివారం భారత్కు చేరుకోనుంది.
భారత్కు ఇరాన్ ఇస్తున్న ప్రాధాన్యత గురించి భారత్లోని ఇరాన్ రాయబారి మొహమ్మద్ ఫతాలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "భారత్, ఇరాన్ చిరకాల మిత్రులు. మాకు ఉమ్మడి ప్రయోజనాలు, ఉమ్మడి భవిష్యత్తు ఉన్నాయి. భారత్ ప్రజల కష్టం మా కష్టంగా భావిస్తాం. అందుకే ఈ సంక్షోభ సమయంలోనూ భారత నౌకలకు మేము రక్షణ కల్పిస్తాం" అని ఆయన స్పష్టం చేశారు. హార్మూజ్ జలసంధి వంటి సున్నితమైన ప్రాంతాల్లో భారత నౌకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూస్తామని ఆయన భరోసా ఇచ్చారు. మొత్తానికి అమెరికా తన ప్రయోజనాల కోసం దేశాలపై ఒత్తిడి తెస్తుంటే.. ఇరాన్ మాత్రం భారత్తో ఉన్న స్నేహానికే పెద్దపీట వేస్తుండటం గమనార్హంగా నిలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa