దేవభూమి ఉత్తరాఖండ్లో మంగళవారం ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. అల్మోరా జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు నియంత్రణ కోల్పోయి లోతైన లోయలోకి దూసుకెళ్లింది. ఈ భయంకరమైన ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. డ్రైవర్తో సహా మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే?
పోలీసుల సమాచారం ప్రకారం.. ఈ బస్సు అల్మోరా జిల్లాలోని ద్వారహత్ నుంచి నైనిటాల్లోని రామ్నగర్ వైపు వెళ్తోంది. భికియాసైన్ ప్రాంతానికి చేరుకోగానే గమ్యస్థానానికి మరో ఆరు కిలో మీటర్ల దూరంలో ఉండగా డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు రోడ్డు పక్కనే ఉన్న వంద అడుగుల లోతైన లోయలోకి పల్టీలు కొడుతూ పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 19 మంది ప్రయాణికులు ఉన్నట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) దేవేంద్ర పించా ధృవీకరించారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో నిమిషాల్లోనే అల్మోరా పోలీసులు, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. లోయ అడుగున పడిపోయిన బస్సు నుంచి ప్రయాణికులను వెలికితీయడం అధికారులకు సవాలుగా మారింది. ఆరుగురు ప్రయాణికులు ఘటన స్థలంలోనే చనిపోగా.. మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో తుదిశ్వాస విడిచారు. తీవ్రంగా గాయపడిన 12 మందిని స్ట్రెచర్ల సహాయంతో పైకి తీసుకు వచ్చి.. సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో పరిస్థితి విషమంగా ఉన్న వారిని మెరుగైన చికిత్స కోసం హైయర్ మెడికల్ సెంటర్లకు తరలించినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘోర ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. "ఈ ఘటన మనసును కలిచి వేసింది. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. జిల్లా యంత్రాంగంతో నేను నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించాను" అని ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
ప్రస్తుతం అల్మోరా జిల్లా అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. లోయలో ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కొండ ప్రాంతాల్లో వరుసగా జరుగుతున్న ఇటువంటి రోడ్డు ప్రమాదాలు పర్యాటకులను, స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa