ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2 వారాల్లో ముగ్గురి దారుణ హత్యలు,,,బంగ్లాదేశ్‌లో ఆగని హిందువుల హత్యలు

international |  Suryaa Desk  | Published : Tue, Dec 30, 2025, 11:09 PM

బంగ్లాదేశ్‌లో హిందువుల రక్షణ రోజురోజుకూ ప్రశ్నార్థకంగా మారుతోంది. గత రెండు వారాల్లోనే ముగ్గురు హిందువులు దారుణంగా హత్యకు గురి కావడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. దీంతో బంగ్లాదేశ్‌లో నివసిస్తున్న మైనారిటీలలో తీవ్ర భయాందోళనలను రేకెత్తిస్తోంది. దీపూ చంద్ర దాస్‌, అమృత్‌ మండల్‌ హత్యల ఉదంతాలు మరువక ముందే.. తాజాగా మరో హిందూ వ్యక్తి అక్కడి వారి చేతిలో అన్యాయంగా బలయ్యాడు. మయమన్‌సింగ్‌ జిల్లాలోని భలుకా ఉపజిల్లాలో ఉన్న సుల్తానా స్వెటర్స్ లిమిటెడ్ గార్మెంట్ ఫ్యాక్టరీలో సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది.


బజేంద్ర బిశ్వాస్ అనే 42 ఏళ్ల వ్యక్తి.. అన్సార్ విభాగంలో సభ్యుడిగా ఉంటూ సుల్తాన్ స్వెటర్స్ లిమిటెడ్ గార్మెంట్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ విధులను నిర్వహిస్తున్నాడు. ఇక నిందితుడు 29 ఏళ్ల నోమన్ మియా కూడా అదే ఫ్యాక్టరీలో బిశ్వాస్‌తో పాటు సహోద్యోగిగా పనిచేస్తున్నాడు. స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితుడు నోమన్ మియా తన వద్ద ఉన్న ప్రభుత్వ తుపాకీని సరదాగా బిశ్వాస్ వైపు గురిపెట్టాడు. ఆ సమయంలో అనుకోకుండా ట్రిగ్గర్ నొక్కడంతో బుల్లెట్ నేరుగా బిశ్వాస్ ఎడమ తొడలోకి దూసుకెళ్లింది.


 ఈ ఘటనతో ఒక్కసారిగా అక్కడ ఏం జరుగుతుందో బిశ్వాస్‌కు అర్థం కాలేదు. అతడికి తీవ్రంగా రక్తస్రావం కావడంతో ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా లేక ఈ దారుణం వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.


బంగ్లాదేశ్‌లో గత రెండు వారాలుగా జరుగుతున్న వరుస హత్యలు అక్కడి పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. డిసెంబర్ 18వ తేదీన భలుకాలో దీపూ చంద్ర దాస్‌ను ఒక గుంపు విచక్షణారహితంగా కొట్టి.. దారుణంగా చంపేసి.. ఆ తర్వాత నిప్పు పెట్టింది. ఆ తర్వాత ఇటీవలె అమృత్ మండల్ హత్యకు గురయ్యాడు. రాజ్‌బరి జిల్లాలో గ్రామస్థులు.. అమృత్ మండల్ అనే యువకుడిని కొట్టి చంపారు. తాజాగా బజేంద్ర బిశ్వాస్ హత్యతో ఈ సంఖ్య మూడుకు చేరింది. అయితే ఇవన్నీ గత 2 వారాల్లోనే జరగడం గమనార్హం. బంగ్లాదేశ్‌లో మైనారిటీల భద్రతపై భారత ప్రభుత్వం, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ.. అక్కడి మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం వీటిని కేవలం విడిగా జరుగుతున్న నేరాలుగానే పేర్కొంటోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa