ఆఫ్రికా ఖండంలోని సోమాలిలాండ్ను ఓ ప్రత్యేక దేశంగా ఇజ్రాయెల్ అధికారికంగా గుర్తించడం తీవ్ర చర్చకు తెరలేచింది. ఇజ్రాయెల్ నిర్ణయంపై అమెరికా సహా దాని మిత్రులు, ఆఫ్రికన్ యూనియన్, పశ్చిమాసియా దేశాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. పాకిస్థాన్ సహా ఇతర ముస్లింలు దేశాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్ మాదిరిగా భారత్ కూడా సోమాలిలాండ్ను భారత్ గుర్తిస్తుందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే, ఈ ప్రచారాన్ని భారత్ ఖండించింది.
ఆఫ్రికా హార్న్లోని సోమాలియాలో అంతర్యుద్ధం తీవ్రస్థాయికి చేరుకోవడంతో 1991లో ఫెడరల్ ఫ్రభుత్వం కూలిపోయింది. దీంతో ఉత్తర సోమాలియా హర్గీసా నగరం కేంద్రంగా ‘ సోమాలిలాండ్ ’ పేరుతో స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. అక్కడ గత 35 ఏళ్లుగా ఎన్నికైన ప్రభుత్వం, పార్లమెంట్, సొంతంగా పోలీసు, కరెన్సీ, పాస్పోర్ట్ వ్యవస్థను ఏర్పాటుచేసుకున్నారు. అధ్యక్షుడు అబ్దిరహ్మాన్ మొహమ్మద్ అబ్దిల్లాహి తమ ప్రాంతానికి దేశ గుర్తింపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజిమిన్ నెతన్యాహు డిసెంబరు 26న చేసిన ప్రకటన సోమాలిలాండ్ను అధికారంగా గుర్తించిన తొలి దేశంగా నిలిచింది. అయితే, ఇతర దేశాల స్పందన మాత్రం సానుకూలంగా లేదు. దీనిని తమ సార్వభౌమాధికారానికి విఘాతం కలిగించే చర్యగా సోమాలియా పేర్కొంది. అలాగే ఆఫ్రికన్ యూనియన్, ఇస్లామిక్ దేశాల కూటమి (OIC) ఈ తరహా చర్యలు ఆ ఖండం అంతటా వేర్పాటువాద ఉద్యమాలకు ఆజ్యం పోసే ప్రమాదం ఉందని హెచ్చరించాయి.
ఇక, పాకిస్థాన్, మరో 20 దేశాలు, OICలు సోమాలిలాండ్ విషయంలో ఇజ్రాయెల్ నిర్ణయాన్ని తిరస్కరించాయి. ఆ దేశ చర్య ‘అంతర్జాతీయ చట్టం పట్ల పూర్తిగా నిర్లక్ష్యం’ అని పాకిస్థాన్ మండిపడింది. ‘సోమాలియా సార్వభౌమాధికారం, ఐక్యత, ప్రాదేశిక సమగ్రతను దెబ్బతీసే ఏవైనా ప్రయత్నాలను పాకిస్థాన్ తీవ్రంగా ఖండిస్తుంది.. ఈ క్రమంలో సోమాలిలాండ్ను రిపబ్లిక్ ప్రాంతంగా గుర్తిస్తూ ఇజ్రాయెల్ చేసిన ప్రకటనను తిరస్కరిస్తున్నాం’ అని పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం తెలిపింది.
ఈ నేపథ్యంలో భారత్ ఇజ్రాయెల్ బాటలో వెళ్తుందంటూ పలువురు నిపుణులు, నెటిజన్లు ఎక్స్ (ట్విట్టర్)లో పెట్టిన పోస్ట్లు గందరగోళానికి గురిచేస్తున్నాయి. సహాన్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్రికా హార్న్, పశ్చిమాసియా విభాగం డైరెక్టర్ రషీద్ అబ్ది ‘సోమాలిలాండ్ను గుర్తించడానికి మరో ప్రధాన ప్రపంచ శక్తి భారత్ ముందుకొస్తోంది... వ్యూహాత్మక ప్రత్యర్థి అయిన చైనాను అడ్డుకోవడమే దాని లక్ష్యం. సోమాలిలాండ్ బెర్బెరా పోర్ట్ వాణిజ్య కారిడార్తో ఆఫ్రికాలోనే అతిపెద్ద మార్కెట్ అయిన ఇథియోపియాతో అనుసంధానం భారతదేశానికి అనేక వాణిజ్య ప్రయోజనాలను అందిస్తుంది’ అని పోస్ట్ పెట్టారు. ఇలాంటి పోస్ట్లే మరికొన్ని సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.
సోషల్ మీడియాలో జరుగుతోన్న ఈ ప్రచారంపై భారత్ స్పందిస్తూ.. వాటిని తోసిపుచ్చింది. తప్పుదోవపట్టించే ఇలాంటి పోస్ట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని విదేశాంగ శాఖ ఫ్యాక్ట్చెక్ విభాగం స్పష్టం చేసింది. ఇక, భారత్లోని సోమాలియా రాయబారి సోమాలిలాండ్కు పారిపోయాడని, సోమాలియా అధ్యక్షుడు అతడిని సస్పెండ్ చేశాడని ధ్రువీకరించని కొన్ని కథనాలు కూడా వచ్చాయి.
ఆసియా, ఆఫ్రికా, ఐరోపాలను కలిపే వాణిజ్య నెట్వర్క్ల కూడలిలో ఒక ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా సోమాలిలాండ్ చరిత్ర రూపుదిద్దుకుంది. దశాబ్దాల పాటు నిశ్శబ్ద రాజకీయ అసాధారణత కొనసాగిన తర్వాత ఇజ్రాయెల్ గుర్తింపుతో ఈ దేశం ఇకపై ప్రపంచ రాజకీయాలకు దూరంగా ఉండదనే సంకేతం వెలువడించింది. శతాబ్దాల నాటి వాణిజ్యంలో పాతుకుపోయి, అల్లకల్లోలమైన ఆధునిక చరిత్రతో రూపుదిద్దుకున్న ఈ దేశం.. రాబోయే సంవత్సరాల్లో ఆఫ్రికా హార్న్ ప్రాంతాన్ని పునర్నిర్మించగల భౌగోళిక రాజకీయ సమీకరణకు కేంద్రంగా నిలవబోతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa