బంగ్లాదేశ్ రాజకీయాల్లో దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయించిన ఇద్దరు మహిళా నాయకులలో ఒకరైన మాజీ ప్రధాన మంత్రి ఖలీదా జియా.. 80 ఏళ్ల వయసులో డిసెంబరు 30 మంగళవారం అనారోగ్యంతో కన్నుమూశారు. బంగ్లాదేశ్కు తొలి మహిళా ప్రధానిగా 1991లో ఖలీదా జియా బాధ్యతలు స్వీకరించారు. మరో ప్రముఖ నాయకురాలు, ఐదుసార్లు ప్రధానిగా పనిచేసిన షేక్ హసీనా గతేడాది ఆగస్టులో విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో అధికారం కోల్పోయారు. ఈ ఇద్దరి మధ్య తీవ్రమైన రాజకీయ వైరం ‘ది బ్యాటిల్ ఆఫ్ ది బేగమ్స్’గా గుర్తింపు పొందింది. ఈ ఇరువురూ నాలుగు దశాబ్దాలకుపైగా బంగ్లా రాజకీయాలను శాసించడం గమనార్హం.
ఖలీదా జియా మృతి పట్ల బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తన పార్టీ అవామీ లీగ్ అధికారిక ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసిన హసీనా ‘బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానిగా, ప్రజాస్వామ్య స్థాపనలో ఆమె పోషించిన పాత్ర అమోఘం.. దేశానికి ఆమె చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి’ అని తెలిపారు. జియా మృతి బంగ్లాదేశ్ రాజకీయాలకు, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP)కి తీరని లోటని హసీనా పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, ఆమె కుమారుడు తారిఖ్ రెహ్మాన్, కుటుంబ సభ్యులకు,బీఎన్పీ కార్యకర్తలకు ఈ కష్టకాలంలో ఓర్పు, బలం ప్రసాదించాలని ఆమె ప్రార్థించారు.
అయితే, 1980వ దశకం నుంచి బంగ్లాదేశ్ రాజకీయాలు ఖలీదా జియా, షేక్ హసీనాల మధ్య తీవ్రమైన పోటీతోనే నడిచాయి. ఈ పోటీ కేవలం ఎన్నికలకే పరిమితం కాలేదు. ప్రభుత్వ వ్యవస్థల్లో అవినీతి, వీధుల్లో హింస, పాలన స్తంభించిపోవడానికి, ప్రజాస్వామ్య రాజకీయాలు బలహీనపడటానికి దారితీసింది. జియా మద్దతుదారులు ఆమెను మర్యాదస్తురాలిగా, సంప్రదాయవాదిగా, ఆచితూచి మాట్లాడే వ్యక్తిగా చూశారు. అయితే, తన పార్టీని, ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో ఆమె ధైర్యవంతురాలని, రాజీపడని నాయకురాలని కూడా భావించారు. హసీనా మాత్రం చాలా బహిరంగంగా, దృఢంగా ఉండేవారు.
ఈ ఇద్దరి మధ్య ద్వేషానికి మూలాలు 1975లో ఉన్నాయి. షేక్ హసీనా తండ్రి, బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు, అవామీ లీగ్ పార్టీ అధినేత షేక్ ముజిబుర్ రెహ్మాన్, ఆయన కుటుంబసభ్యులు సైనిక తిరుగుబాటులో హత్యకు గురయ్యారు. మూడు నెలల తర్వాత, జియా భర్త, అప్పటి సైనిక దళాల డిప్యూటీ చీఫ్ జియౌర్ రెహ్మాన్ దేశాన్ని తన ఆధీనంలోకి తీసుకుని, 1977లో అధ్యక్షుడయ్యారు.
కానీ, 1981లో రెహ్మాన్ కూడా హత్యకు గురయ్యారు. అప్పటికి 35 ఏళ్ల వయసున్న జియా, బీఎన్పీ పగ్గాలను చేపట్టారు. మొదట్లో ఆమెను రాజకీయాల్లో కొత్తగా వచ్చిన వ్యక్తిగా చూశారు. కానీ, ఆమె షేక్ హసీనాతో కలిసి ప్రజాస్వామ్యం కోసం జరిగిన ఉద్యమానికి నాయకత్వం వహించి, సైనిక నియంత హోస్సేన్ మొహమ్మద్ ఎర్షాద్ను 1990లో అధికారం నుంచి తొలగించి, తాను కూడా ఒక బలమైన ప్రత్యర్థి అని నిరూపించుకున్నారు.
అయితే, జియా, హసీనాల స్నేహం ఎక్కువ కాలం నిలవలేదు. 1991లో బంగ్లాదేశ్ తొలి స్వేచ్ఛాయుత ఎన్నికలు జరిగాయి. దేశంలోనే అతిపెద్ద ఇస్లామిక్ పార్టీ అయిన జమాతే ఇస్లామీ మద్దతుతో షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్పై జియా విజయం సాధించారు. దీంతో బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానిగా ఆమె బాధ్యతలు చేపట్టారు. అంతేకాదు, బెనజీర్ భుట్టో తర్వాత ఓ ముఖ్యమైన ముస్లిం దేశంలో ప్రజాస్వామ్యానికి నాయకత్వం వహించిన రెండో మహిళగానూ ఆమె నిలిచారు.
అధ్యక్ష తరహా పాలనను పార్లమెంటరీ వ్యవస్థగా మార్చి, అధికారాన్ని ప్రధాని చేతుల్లోకి తీసుచ్చారు. ఆ తర్వాత పదిహేనేళ్లపాటు, ఈ ఇద్దరు మహిళల మధ్యే బంగ్లాదేశ్లో అధికారం చేతులు మారింది. 1996లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హసీనా చేతిలో ఓడిపోయిన జియా.. ఐదేళ్ల తర్వాత జరిగి ఎన్నికల్లో భారీ మెజారిటీతో తిరిగి అధికారంలోకి వచ్చారు.
అయితే, ఆమె రెండోసారి ప్రధాని అయినప్పుడు ఇస్లామిక్ తీవ్రవాదుల పెరుగుదల, అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆమె దృఢ సంకల్పానికి ప్రశంసలు అందుకున్నప్పటికీ, రాజీపడటానికి నిరాకరించడం వల్ల దేశీయంగా, అంతర్జాతీయంగా ఒంటరిగా మిగిలిపోయారని విమర్శలు ఎదుర్కొన్నారు. 2004లో షేక్ హసీనా ప్రసంగిస్తున్న ర్యాలీపై గ్రెనేడ్ దాడులు జరిగాయి. ఈ ఘటనలో హసీనా ప్రాణాలతో బయటపడినా.. 20 మందికి పైగా చనిపోయాారు. మరో 500 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనకు జియా ప్రభుత్వం, దాని ఇస్లామిక్ మద్దతుదారులు బాధ్యులని విస్తృత ఆరోపణలు వచ్చాయి.
ఇద్దరి బేగమ్ల మధ్య రాజీలేని వైరం 2007 జనవరిలో సైనిక జోక్యానికి దారితీసిన సంక్షోభాలతో సహా అనేక సమస్యలకు కారణమైంది. ఆ తర్వాత, 2008 నుంచి 2024లో అధికారం కోల్పోయే వరకు షేక్ హసీనా బంగ్లాదేశ్ను పాలించారు. హసీనా భారత్లో ఆశ్రయం పొందుతుండగా.. అవామీ లీగ్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకుండా మహమ్మద్ యూనస్ నాయకత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం నిషేధించింది. దీంతో వచ్చే ఏడాది ఎన్నికల తర్వాత జియా తన దేశానికి చివరిసారిగా నాయకత్వం వహిస్తుందని భావించారు. కానీ, ఎన్నికలకు కొద్ది రోజుల ముందే ఆమె మరణించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa