అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హాట్ టాపిక్గా మారారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫ్లోరిడాలోని మార్-ఏ-లాగో రిసార్ట్లో జరిగిన భేటీలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన సైనిక ఘర్షణను తానే ఆపానని.. అయినప్పటికీ తనకు తగిన గుర్తింపు దక్కలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
నేనే ఆపా.. కానీ క్రెడిట్ ఇవ్వలేదు!
నెతన్యాహు, ఆయన ప్రతినిధి బృందంతో భేటీ కావడానికి ముందు మైక్ ఆన్ ఉన్న విషయం గమనించని ట్రంప్ తన దౌత్య విజయాల గురించి ఏకరువు పెట్టారు. "నేను ఇప్పటి వరకు ఎనిమిది యుద్ధాలను పరిష్కరించాను. కానీ ఆ దేశాల పేర్లు ఎవరికీ తెలియవు. ఉదాహరణకు అర్మేనియా - అజర్బైజాన్ మధ్య యుద్ధాన్ని కేవలం సుంకాలు విధిస్తానని బెదిరించి ఒక్క రోజులో ఆపేశాను. దీనిపై స్వయంగా పుతిన్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు" అని ట్రంప్ వెల్లడించారు.
ఇదే క్రమంలో భారత్-పాక్ అంశాన్ని ప్రస్తావిస్తూ.. "భారత్, పాకిస్థాన్ల మధ్య గొడవను కూడా నేనే సెటిల్ చేశాను. సుమారు 70 సార్లకు పైగా నేను ఇదే విషయం చెబుతున్నా.. నాకు కనీసం నోబెల్ శాంతి బహుమతి కూడా ఇవ్వలేదు" అని నెతన్యాహు వద్ద తన ఆవేదనను వెళ్లగక్కారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, జారెడ్ కుష్నర్ వంటి కీలక నేతల సమక్షంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
భారత్ ఏమంటోంది?
ట్రంప్ ఎన్నిసార్లు తానే యుద్ధం ఆపినట్లు చెబుతున్నా.. భారత్ మాత్రం దీనిని మొదటి నుంచీ ఖండిస్తూనే ఉంది. ఈ ఏడాది మే నెలలో పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ 'ఆపరేషన్ సింధూర్' చేపట్టింది. పాక్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకుపడింది. మే 10వ తేదీన ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ కుదిరినప్పటికీ.. అది కేవలం రెండు దేశాల మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ల మధ్య జరిగిన చర్చల ఫలితమేనని భారత్ స్పష్టం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా పార్లమెంటులో మాట్లాడుతూ.. 'ఆపరేషన్ సింధూర్'ను ఆపమని ఏ ప్రపంచ దేశాధినేత కూడా భారత్ను కోరలేదని, స్వతంత్రంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని కుండబద్దలు కొట్టారు. మూడవ పక్షం మధ్యవర్తిత్వాన్ని భారత్ ఎప్పుడూ అంగీకరించబోదని న్యూఢిల్లీ పునరుద్ఘాటించింది.
తాను కేవలం మాటలతో కాకుండా వాణిజ్యపరమైన ఆంక్షలతో యుద్ధాలను ఆపుతున్నానని ట్రంప్ చెప్పుకొచ్చారు. "మీరు యుద్ధం ఆపకపోతే మీ దేశాల నుంచి వచ్చే ఉత్పత్తులపై 200 శాతం సుంకాలు వేస్తానని బెదిరించాను. మరుసటి రోజే వారు కాల్ చేసి యుద్ధం ఆపేస్తున్నట్లు చెప్పారు" అని ట్రంప్ వివరించారు. భారత్-పాక్ విషయంలో కూడా వాణిజ్య రాయితీలు ఆశ చూపి శాంతిని నెలకొల్పానని ఆయన వాదిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa