ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇద్దరు, ముగ్గురు పిల్లల్ని కనండి,,,, హిందూ జంటలకు సర్కారు సూచన

national |  Suryaa Desk  | Published : Wed, Dec 31, 2025, 09:46 PM

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి జనాభా అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మారుతున్న జనాభా సమతుల్యత పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ.. హిందూ దంపతులు ఎక్కువ మంది పిల్లలను కనాలంటూ ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం విలేకరులతో మాట్లాడిన ఆయన.. ముస్లిం మైనారిటీలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో జననాల రేటు ఎక్కువగా ఉంటే, హిందువుల జనాభా మాత్రం క్రమంగా తగ్గుతోందని పేర్కొన్నారు.


హిందూ దంపతులు కేవలం ఒక్క బిడ్డతోనే సంతానాన్ని ఆపివేయకూడదని సీఎం హిమంత సూచించారు. "హిందూ జనాభా నిష్పత్తి పడిపోతోంది. అందుకే హిందూ దంపతులు కనీసం ఇద్దరు, వీలైతే ముగ్గురు పిల్లలను కనాలని నేను కోరుతున్నాను. హిందువులు జనాభాను పెంచుకోకపోతే.. భవిష్యత్తులో వారి ఇళ్లను చూసుకునే వారు కూడా ఉండరు" అని ఆయన వ్యాఖ్యానించారు. అదే సమయంలో ముస్లిం సోదరులు ఏడుగురు లేదా ఎనిమిది మంది పిల్లలను కనవద్దని తాము కోరుతున్నామని.. కానీ హిందువులు మాత్రం సంతానాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన వివరించారు.


అంతకుముందు డిసెంబర్ 27వ తేదీన జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మరింత లోతైన గణాంకాలను వెల్లడించారు. 2027లో జరగబోయే జనాభా గణన నాటికి అసోంలో బంగ్లాదేశీ సంతతికి చెందిన ముస్లింల జనాభా 40 శాతానికి చేరుకోవచ్చని ఆయన అంచనా వేశారు. 1990లలో ముస్లింల జనాభా 21 శాతంగా ఉండేదని గుర్తు చేశారు. 2011 గణనలో ఇది 31 శాతానికి పెరిగిందని చెప్పారు. ఇక 2027 నాటికి ఈ సంఖ్య 40 శాతం దాటే అవకాశం ఉందని.. అప్పుడు అస్సాం మూలవాసుల జనాభా 35 శాతం కంటే తక్కువకు పడిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.


బంగ్లాదేశ్ నుంచి వస్తున్న అక్రమ చొరబాటుదారుల వల్ల ఈశాన్య భారతం ముప్పులో ఉందని ఆయన హెచ్చరించారు. "ఒకవేళ వారి జనాభా 50 శాతం దాటితే.. వారు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రాంతం దానంతట అదే వారి వశమవుతుంది" అని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ముస్లింలకు 48 అసెంబ్లీ స్థానాలు రిజర్వ్ చేయాలని డిమాండ్ చేస్తోందని.. కానీ బీజేపీ మాత్రం మతంతో సంబంధం లేకుండా అస్సాం మూలవాసుల హక్కుల కోసం పోరాడుతుందని స్పష్టం చేశారు. హిమంత బిశ్వ శర్మ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ స్థాయిలో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. విపక్షాలు దీనిని మతపరమైన విభజనగా అభివర్ణిస్తుండగా.. రాష్ట్ర అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఇది అవసరమని బీజేపీ వర్గాలు మద్దతు తెలుపుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa