ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అండర్‌వేర్ ట్యాంపరింగ్ కేసు.... కేరళ మాజీ మంత్రికి మూడేళ్లు జైలు

national |  Suryaa Desk  | Published : Sun, Jan 04, 2026, 08:06 PM

సహాయం చేయడానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. ఇతరుల కష్టం తీర్చడానికో, వారిని ఆదుకోవడానికో కాకుండా.. స్వార్థ ప్రయోజనాల కోసం వెరొకరికి సాయం చేస్తే చిక్కుల్లో పడటం ఖాయం. తాజాగా కేరళ మాజీ రవాణా శాఖ మంత్రి ఆంటొనీ రాజుకి కూడా ఇలాంటి పరిస్థితే వచ్చింది. డ్రగ్స్ సరఫరా చేస్తూ అడ్డంగా దొరికిపోయిన ఓ విదేశీయుడికి కొన్నేళ్ల క్రితం రాజు సహాయం చేశారు. సీజ్ చేసిన ఆధారాలను తారుమారు చేశారు. చివరికి ఈ కేసులో మూడేళ్ల కారాగార శిక్ష విధించింది న్యాయస్థానం.


ఇదీ కేసు..


1990 ఏప్రిల్ 4న ఆండ్రూ సాల్వెటోర్‌ సెర్వెల్లి అనే ఆస్ట్రేలియా జాతీయుడిని కేరళ తిరువనంతపురం విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. అతడు తన అండర్‌వేర్‌లో రెండు ప్యాకెట్ల డ్రగ్స్ పెట్టుకున్నాడని ఆరోపణలు చేశారు. ఈ కేసులో ఆండ్రూకు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది సెషన్స్ కోర్టు. నిందితుడి తరఫున అప్పుట్లో జూనియర్ లాయర్‌గా పనిచేసిన ఆంటొనీ రాజు వకాల్తా తీసుకున్నాడు. కాగా, సెషన్స్ కోర్టు తీర్పును నిందింతుడు కేరళ హైకోర్టులో సవాల్ చేశాడు. ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు.. డ్రగ్స్ సరఫరా చేసిన నిందితుడి అండర్‌వేర్ చాలా చిన్నగా ఉందని పేర్కొంది. అది సరైన ఆధారం కాదని నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది. అనంతరం అండ్రూ తన స్వదేశానికి వెళ్లిపోయాడు.


కొన్నేళ్ల తర్వాత ఈ కేసును దర్యాప్తు చేసిన అధికారి హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులలో ఆధారాలను తారుమారు చేశారా లేదో తెలుసుకునేలా దర్యాప్తుకు ఆదేశించాలని కోరారు. ఆస్ట్రేలియా సెంట్రల్ బ్యూరో నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా దర్యాప్తు అధికారి.. కోర్టులో ఈ మేరకు పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా జాతీయుడి తరఫున వాదించిన ఆంటొనీ రాజుతో పాటు కోర్టు క్లర్క్ కేజే జోస్‌పై 1994లో కేసు నమోదైంది. 12 ఏళ్ల తర్వాత 2006లో రాజుపై ఛార్జిషీటు దాఖలైంది. అతడు క్లర్క్‌తో కలిసి.. మేజిస్ట్రేట్ కోర్టులో ఉన్న ఆధారాలను తారుమారు చేశారని దర్యాప్తు అధికారులు వాదించారు.


కాగా, తిరువనంతపురం ట్రయల్ కోర్టులో క్రిమినల్ ప్రొసీడింగ్స్ నుంచి తనకు ఉపశమనం కలిగించాలని సుప్రీం కోర్టుకు వెళ్లాడు ఆంటొనీ రాజు. అయితే రాజు పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీం కోర్టు.. క్రిమినల్ ప్రొసీడింగ్స్ యథాతథంగా జరుగుతాయని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా నెడుమంగడ్‌లోని ఫస్ట్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఆంథోనీ రాజును దోషిగా తేల్చింది. మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.


మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేరు..


మూడేళ్లు జైలు శిక్ష పడటంతో ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం ఆంథోనీ రాజుపై అనర్హత వేటు పడనుంది. న్యాయ సలహా తీసుకున్న తర్వాత అసెంబ్లీ సెక్రటేరియట్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేయనుంది. జనాధిపత్య కేరళ కాంగ్రెస్ పార్టీ సభ్యుడైన ఆంథోనీ రాజు.. ప్రస్తుతం అధికార ఎల్‌డీఎఫ్ కూటమిలో భాగంగా ఉన్నారు. అనర్హత వేటు పడితే 2026 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు ఉండదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa