ట్రెండింగ్
Epaper    English    தமிழ்

51 ఏళ్ల తర్వాత నిర్దోషిగా తేల్చిన కోర్టు, ఇంకా పరారీలోనే నిందితుడు

national |  Suryaa Desk  | Published : Sun, Jan 04, 2026, 08:09 PM

ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 51 సంవత్సరాలు దాటింది.. ఒక కేసులో తుది తీర్పు రావడానికి. చివరికి సాక్ష్యాధారాలు లేవని నిందితుడిని నిర్దోషిగా తేల్చింది కోర్టు. ఇన్నేళ్లుగా నిందితుడు పరారీలో ఉండటం, ఇప్పటికే అతడి ఆచూకీ తెలియకపోవడం ఈ కేసులో మరో విచిత్రమైన విషయం. మరి ఇన్ని సంవత్సరాల సమయం పట్టిందంటే.. అతడు చేసింది హత్యలు, ఘరానా దోపిడీలు అనుకుంటే పొరపాటే. ఒక చేతిగడియారం, రూ. 4, హ్యాండ్ కర్ఛీఫ్. భారత న్యాయవ్యవస్థ పనితీరుకు అద్దం పట్టే ఈ ఘటన మహారాష్ట్రలోని పూణెలో జరిగింది. ఆ వివరాలు..


ఇదీ కేసు..


అది 1974, అప్పుడు ఒక డాలర్ మారకపు విలువ రూ. 8గా ఉండేది. పూణె బండ్ గార్డెన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మార్చి 14న.. ఓ వ్యక్తి నుంచి రూ. 60 విలువ చేసే చేతి గడియారం, రూ. 4, ఒక హ్యాండ్ కర్ఛీఫ్ దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో సదరు వ్యక్తి బండ్ గార్డెన్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. ఈ దొంగతనంపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అందులో రాజారాం తుకారాం కాలే అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరిని నిందితులుగా పేర్కొన్నారు. కేసు విచారణలో భాగంగా రాజారాం కాకుండా.. మిగతా ఇద్దరు నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. దీంతో వారికి కోర్టు.. 1975 ఏప్రిల్‌లో మూడు నెలల జైలు శిక్ష విధించింది. అయితే అప్పుడు రాజారాం మాత్రం తన తప్పును ఒప్పుకోలేదు. పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేసిన తర్వాత.. రాజారాం పారిపోయాడు.


కాగా, రాజారాం పారిపోయిన తర్వాత కోర్టులో కేసు విచారణ ఆగిపోయింది. కోర్టు రికార్డుల ప్రకారం.. రాజారాంకు ఎప్పటికప్పుడు నాన్-బెయిలబుల్ వారంట్లు, ప్రొక్లెయిమేషన్ ప్రోసీడింగ్స్ జారీ చేశారు. కానీ అతడు ఎక్కడున్నాడో మాత్రం కనిపెట్టలేకపోయారు పోలీసులు. ఇప్పటికీ రాజారాం ఎక్కడున్నాడో తెలియదు. ఈ నేపథ్యంలో పూణెలోని జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్‌క్లాస్ కోర్టు జడ్జిగా ఎన్‌జే చవాన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసులపై సమీక్ష నిర్వహించారు. దీంతో ఈ కేసు బయటపడింది. దీనిపై కోర్టులో మళ్లీ విచారణ ప్రారంభమైంది.


విచారణ తర్వాత రాజారాం తురాకారం కాలేను నిర్దోషిగా తేల్చారు రైల్వే కోర్టులోని ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎన్ జె చవాన్. 2025 డిసెంబర్ 26న ఈ కేసులో తుది తీర్పు ఇచ్చారు. "నిందితుడికి వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ ఇప్పటివరకు ఎలాంటి సాక్షులను ప్రవేశపెట్టలేకపోయింది. నిందితుడిపై ఎటువంటి ఆధారాలు ఇవ్వలేదు. దోషిగా నిర్ధరించబడటానికి తగినన్ని ఆధారాలు లేకపోతే.. ఈ కేసును నిరవధికంగా పెండింగ్‌లో ఉంచడంలో సరైంది కాదు. అందుకే కోర్టు, పోలీసు యంత్రాంగం, ప్రాసిక్యూషన్ సమయం వృథా కాకుండా.. తగిన ఉత్తర్వులు జారీ చేయడం మంచిది. అందుకే అతడిపై జారీ అయిన వారెంట్లన్నీ రద్దు చేస్తూ నిర్దోషిగా ప్రకటిస్తున్నాము" అని జడ్జి వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa